WPL 2026: UP Warriorz Defeat Mumbai Indians Again in Season 4

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 నాలుగో సీజన్లో యూపీ వారియర్జ్ జట్టు మరోసారి ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 165 పరుగులకే పరిమితమైంది. దీంతో యూపీ వారియర్జ్ జట్టు 22 పరుగుల తేడాతో గెలుపొందింది.
ముంబై బ్యాటర్లలో అమేలియా కెర్ 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్తో అజేయంగా 49 పరుగులు చేసింది. అమన్జోత్ కౌర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసి పోరాడింది. అయితే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 18 పరుగులు, హేలీ మాథ్యూస్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచారు.
యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్, సోఫీ ఎకిల్స్టోన్, దీప్తి శర్మ, క్లో ట్రయాన్ తలా ఒక వికెట్ తీశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, ఫోబ్ లీచ్ఫీల్డ్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ 25 పరుగులు, క్లో ట్రయాన్ 21 పరుగులతో జట్టుకు మంచి స్కోర్ అందించారు.
ముంబై బౌలర్లలో అమేలియా కెర్ మూడు వికెట్లు పడగొట్టగా, నాట్ సైవర్-బ్రంట్ రెండు వికెట్లు సాధించింది. నికోలా కారీ, హేలీ మాథ్యూస్, అమన్జోత్ కౌర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఈ సీజన్లో ఇప్పటివరకు యూపీ వారియర్జ్ ఐదు మ్యాచ్లు ఆడగా, రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆ రెండు విజయాలు కూడా ముంబై ఇండియన్స్పైనే రావడం విశేషం. తాజా విజయంతో యూపీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
మరిన్నివార్తలుచదవండి: సూర్యకుమార్ యాదవ్ వివాదం: ఖుషీ ముఖర్జీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా