IPL

Yash Dayal Arrested Ahead of IPL 2026? 38-Year-Old Veteran Tipped as Replacement

by Krishna R

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే వచ్చే సీజన్ నుంచి ఆర్‌సీబీ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో మైదానంలోకి దిగనుండగా, జట్టు విక్రయానికి సంబంధించిన ప్రక్రియ కూడా తుది దశకు చేరింది. ఇలాంటి సమయంలో, ఐపీఎల్ 2025 టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేస్ బౌలర్ యశ్ దయాల్‌పై తీవ్ర ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ యశ్ దయాల్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, మరో 17 ఏళ్ల బాలిక కూడా తనపై యశ్ దయాల్ లైంగిక దాడి చేశాడని ఆరోపణలు చేసింది.

ఈ నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదుకావడంతో, యశ్ దయాల్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయస్థానం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో పోలీసులు త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో యశ్ దయాల్ ఆడటం దాదాపు అసాధ్యంగా మారింది. అంతేకాదు, బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడిని జట్టులో కొనసాగించడం సరికాదనే అభిప్రాయానికి ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ కూడా వచ్చే అవకాశముంది. అందుకే యశ్ దయాల్ స్థానంలో భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను తీసుకోవాలనే ఆలోచనలో జట్టు ఉన్నట్లు సమాచారం.

ఉమేశ్ యాదవ్‌కు ఇది మరో అవకాశం కావొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసిన ఉమేశ్, ఆ తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయాడు.

2023 సీజన్‌లో కేవలం 19 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఒకే ఒక్క వికెట్ సాధించాడు. 2024లో 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసినా, 2025 సీజన్‌లో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. 2026 ఐపీఎల్ వేలంలో కూడా ఉమేశ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.

గతంలో 2018 నుంచి 2020 వరకూ మూడు సీజన్ల పాటు ఉమేశ్ యాదవ్ ఆర్‌సీబీ తరఫున ఆడాడు. 2018 సీజన్‌లో అతడు 20 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించగా, 2019 సీజన్‌లో 8 వికెట్లు సాధించాడు.

ఇప్పుడు మళ్లీ ఆర్‌సీబీ జట్టులోకి అతడికి అవకాశం లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2026కు ముందు ఆర్‌సీబీ తీసుకునే నిర్ణయాలు జట్టు భవిష్యత్తును ఎలా మలుస్తాయో చూడాలి.

మరిన్ని వార్తలు చదవండి: దేశవాళీ వన్డేలో చరిత్ర: సచిన్‌ను దాటిన కోహ్లీ, ఢిల్లీకి ఘన విజయం