
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ తీవ్ర చిక్కుల్లో పడిపోయాడు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన కేసులో అతను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను జైపూర్ పోక్సో కోర్టు బుధవారం తిరస్కరించింది.
జైపూర్కు చెందిన 17 ఏళ్ల యువతి, తన క్రికెట్ కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సహాయం చేస్తానని చెప్పి యశ్ దయాల్ తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఆమె మైనర్ కావడంతో యశ్ దయాల్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ యశ్ దయాల్ తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించగా, ఇది అత్యంత తీవ్రమైన నేరమని, మైనర్కు సంబంధించిన వ్యవహారం కావడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని జైపూర్ పోక్సో కోర్టు స్పష్టం చేసింది. అలాగే అతని అరెస్టుపై స్టే ఇవ్వడానికి కూడా న్యాయస్థానం నిరాకరించింది.
ఇదిలా ఉండగా, యశ్ దయాల్పై ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో కూడా మరో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల సింగ్ అనే యువతి ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాల్ అరెస్టుపై స్టే ఇచ్చింది. అయితే జైపూర్లో నమోదైన పోక్సో కేసులో మాత్రం అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు.
ఐపీఎల్ 2025 సీజన్లో యశ్ దయాల్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి, ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా అతను ఒక వికెట్ సాధించాడు. అయితే తాజా ఆరోపణలు మరియు పోక్సో కేసు అతని కెరీర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ కేసులో యశ్ దయాల్ అరెస్ట్ అయితే, అతనిపై బీసీసీఐ నిషేధం విధించే అవకాశమూ ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి: భారత్ vs న్యూజిలాండ్ 2026: పూర్తి ODI & T20I షెడ్యూల్, జట్లు & లైవ్ స్ట్రీమ్