IPL

Abhishek Sharma hits six on first ball for third time creates world record

by Krishna R

భారత్‌, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ పోరులో భారత్‌ ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ గెలుపులో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో అతను చేసిన మరో ఘనత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లుంగి ఎంగిడి వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలచిన అభిషేక్, ఓ అరుదైన వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి బంతినే సిక్సర్‌గా మార్చడం అభిషేక్ శర్మకు ఇది మూడోసారి కావడం విశేషం. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించాడు. గతంలో బంగ్లాదేశ్‌పై ఒకసారి, పాకిస్తాన్‌పై మరోసారి ఇదే తరహాలో తొలి బంతికే సిక్సర్ కొట్టిన అభిషేక్… ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అదే ఘనతను పునరావృతం చేశాడు.

ఇప్పటివరకు అభిషేక్ శర్మ కేవలం 21 టీ20 మ్యాచ్‌లే ఆడినా, ఇప్పటికే 58 సిక్సర్లు బాదడం అతని విధ్వంసకర బ్యాటింగ్‌కు నిదర్శనం. గణాంకాల ప్రకారం అతను సగటున ప్రతి 6.83 బంతులకు ఒక సిక్సర్ కొడుతున్నాడు. దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తూ ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

అయితే మరోవైపు, అభిషేక్ గత ఆరు ఇన్నింగ్స్‌లుగా హాఫ్ సెంచరీ చేయలేకపోతున్నాడు. మంచి ఆరంభాలు అందుకుంటున్నప్పటికీ, కీలక సమయంలో వికెట్‌ను కోల్పోతున్నాడు. దీంతో రాబోయే లక్నో టీ20లో అతని హాఫ్ సెంచరీల కరువు తీరుతుందని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.5 ఓవర్లలోనే చేధించి విజయం సాధించింది. అయితే ఈ ఘన విజయం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడం మాత్రం జట్టు మేనేజ్‌మెంట్‌కు స్వల్ప ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది.

మరిన్ని వార్తలు చదవండి: బుమ్రా తర్వాత మరో షాక్.. మిగిలిన టీ20లకు కీలక ఆటగాడు అందుబాటులో లేడా?