బుమ్రా తర్వాత మరో షాక్.. మిగిలిన టీ20లకు కీలక ఆటగాడు అందుబాటులో లేడా?

సౌతాఫ్రికాతో మూడో టీ20లో విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్య కారణాలతో ఈ మ్యాచ్కు దూరమైన ఓ స్టార్ ఆల్రౌండర్.. మిగిలిన రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.
స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్లో 2-0తో వైట్వాష్కు గురైన భారత్.. ఆ తర్వాత వన్డే సిరీస్ను మాత్రం 2-1తో సొంతం చేసుకుంది. అదే జోరుతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ సేన.. కటక్లో జరిగిన తొలి టీ20లో ఏకంగా 101 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. అయితే ముల్లన్పూర్లో జరిగిన రెండో టీ20లో మాత్రం 51 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఈ నేపథ్యంలో ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ తిరిగి సత్తా చాటి గెలుపు బాట పట్టింది. ఈ విజయంతో సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో భారత జట్టు తుది జట్టులో రెండు కీలక మార్పులతో బరిలోకి దిగింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరమవ్వగా, ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతి ఇచ్చారు.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అక్షర్ పటేల్ అనారోగ్యానికి గురయ్యాడని, అందుకే మిగిలిన రెండు టీ20 మ్యాచ్లకు కూడా అతడు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది నిజమైతే, ఇప్పటికే బుమ్రా లేకపోవడం భారత్కు పెద్ద లోటు కాగా, అక్షర్ కూడా అందుబాటులో లేకపోతే తుది జట్టు కూర్పు విషయంలో టీమిండియా మేనేజ్మెంట్కు కాస్త సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ సిరీస్లో ఇప్పటివరకు అక్షర్ పటేల్ మంచి ప్రదర్శననే చేశాడు. కటక్ టీ20లో 23 పరుగులు చేయడంతో పాటు 2 పరుగులకే 2 వికెట్లు పడగొట్టాడు. ముల్లన్పూర్ మ్యాచ్లో 21 పరుగులు చేసి ఒక వికెట్ సాధించాడు. అతని స్థానంలో మూడో టీ20లో అవకాశం దక్కించుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు కీలక వికెట్లతో మెరిశాడు.
ఇక భారత్ – సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా బుధవారం జరగనుండగా, శుక్రవారం జరిగే ఐదో మరియు చివరి మ్యాచ్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం భారత ప్రాథమిక జట్టు:
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ వికెట్ కీపర్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని వార్తలు చదవండి: విజయ్ హజారే ట్రోఫీ 2025–26: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.