అన్ని

IPL 2026 మాక్ వేలంలో సంచలనం.. రూ. 30.50 కోట్లకు గ్రీన్ ఎవరి సొంతం?

క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు పూర్తిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంపైనే నిలిచింది. అబుదాబి వేదికగా డిసెంబర్ 16న జరగనున్న అసలు వేలానికి ముందే ఉత్కంఠ పెరిగింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్, మాజీ భారత క్రికెటర్లతో కలిసి ఒక మాక్ వేలాన్ని నిర్వహించి ఆసక్తిని మరింత పెంచింది.

ఈ మాక్ వేలంలో మొత్తం ముప్పై మంది ఆటగాళ్లను వేలం వేయగా, పది ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ పది మంది భారత మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. అయితే ఈ మాక్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున పాల్గొన్న రాబిన్ ఊతప్ప తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

గ్రీన్ విషయంలో స్పష్టత

ఐపీఎల్ 2026 వేలానికి ముందు నుంచే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అతడు తన పేరును పూర్తిస్థాయి బ్యాటర్‌గా నమోదు చేయడం కొంత గందరగోళాన్ని సృష్టించింది. గ్రీన్ ఈసారి బౌలింగ్ చేస్తాడా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో, ఫ్రాంచైజీల్లో మొదలయ్యాయి.

ఈ అంశంపై గ్రీన్ తాజాగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చాడు. తాను బౌలింగ్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానని, తన మేనేజర్ చేసిన చిన్న పొరపాటు వల్లే అనుకోకుండా ప్యూర్ బ్యాటర్ ఆప్షన్‌కు టిక్ పడిందని వెల్లడించాడు. దీంతో ఆ సందేహాలకు తెరపడింది.

రైనా వర్సెస్ ఊతప్ప పోటీ

మాక్ వేలంలో గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేశ్ రైనా, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రాబిన్ ఊతప్ప గట్టిగా పోటీపడ్డారు. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా బిడ్ పెంచుతూ వెళ్లారు. ఈ క్రమంలో గ్రీన్ ధర రూ. 27 కోట్లను దాటినా కూడా ఊతప్ప వెనక్కి తగ్గలేదు.

×
Suresh Raina Batsman

చివరికి ఊతప్ప ఏకంగా రూ. 30.50 కోట్ల భారీ ధరతో కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరగా నిలిచింది. గత మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్, రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన రికార్డును ఈ మాక్ వేలంలో ఊతప్ప బద్దలు కొట్టాడు.

గ్రీన్‌కే సగం పర్స్

ఈ మాక్ వేలంలో ఊతప్ప తన జట్టు పర్సులో దాదాపు సగం మొత్తాన్ని ఒక్క గ్రీన్ కోసమే వెచ్చించడం విశేషంగా నిలిచింది. గ్రీన్‌తో పాటు జానీ బెయిర్‌స్టోను రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేశాడు. అలాగే శ్రీలంక యువ పేసర్, చెన్నై మాజీ బౌలర్ మతీశ పతిరణ కోసం ఏకంగా రూ. 13 కోట్లు ఖర్చు పెట్టాడు.

కేకేఆర్ వద్ద భారీ పర్స్

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్, వెంకటేశ్ అయ్యర్ మరియు ఆండ్రీ రసెల్ వంటి ఖరీదైన ఆటగాళ్లను విడిచిపెట్టింది. ఈ కారణంగా కేకేఆర్ పర్సులో మొత్తం రూ. 64.3 కోట్లు మిగిలాయి.

రసెల్ రిటైర్మెంట్ తర్వాత ఆల్‌రౌండర్ లోటును భర్తీ చేయడానికి కామెరూన్ గ్రీన్ సరైన ఎంపికగా భావించిన ఊతప్ప, మాక్ వేలంలో అతడిపై అంత భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేకేఆర్ జట్టులో మొత్తం 13 స్థానాలు ఖాళీగా ఉండటంతో, అసలు వేలంలో కూడా ఈ జట్టు పెద్ద ఎత్తున సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు చదవండి: IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్ ఘన విజయం, సిరీస్‌లో 2-1 ఆధిక్యం

Guna SRV
Guna SRV

I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.

నవీకరణలు