After Yash Dayal, Another Controversy Hits Virat Kohli’s Fan Swastik Chikara

విరాట్ కోహ్లికి అతిభక్తుడిగా పేరొందిన యువ క్రికెటర్ స్వస్తిక్ చికారా తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. గత సీజన్లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టులో భాగంగా ఉన్న చికారా, ఓ యువతి చేసిన ఆరోపణలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. రాధికా శర్మ అనే యువతితో చికారా చేసిన అభ్యంతరకర సంభాషణకు సంబంధించిన చాట్ స్క్రీన్షాట్లు బయటకు రావడంతో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.
చాట్ల ప్రకారం చికారా ఆమెను కేఫ్ లేదా రెస్టారెంట్లో కలవాలని పదే పదే ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. కన్పూర్లోని ఓ మాల్లో ఇద్దరూ కలిసిన తర్వాత, ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడని రాధికా ఆరోపించింది. విసిగిపోయిన ఆమె, చికారా తనను సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఫ్లర్ట్ మెసేజ్లు పంపాడని ఆధారాలతో సహా బహిర్గతం చేసింది.
ఈ లీకైన చాట్లు చికారా వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయడమే కాకుండా, అతను గతంలో ప్రాతినిధ్యం వహించిన డిఫెండింగ్ ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ బ్రాండ్కూ మచ్చ తీసుకొచ్చాయి. క్రికెట్కు సంబంధించినవి కాని కారణాల వల్ల ఆర్సీబీ విమర్శల పాలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో మహిళలపై వేధింపుల ఆరోపణలతో ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్పై ఘాజియాబాద్, జైపూర్లలో కేసులు నమోదవడం పెద్ద దుమారమే రేపింది. ఆ ఉదంతంతోనే ఫ్రాంచైజీ ప్రతిష్టకు భారీ దెబ్బ తగిలింది.
ఇప్పుడు చికారా వివాదం మరోసారి ఆర్సీబీని ఇబ్బందుల్లోకి నెట్టింది. 17 సీజన్ల పాటు టైటిల్ లేకుండా పోరాడినప్పటికీ, క్లీన్ ఇమేజ్ ఉన్న ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన ఆర్సీబీ, దయాల్ మరియు చికారా ఘటనలతో విమర్శల కేంద్రంగా మారింది. యశ్ దయాల్ను 2026 మినీ వేలానికి ముందే రిటైన్ చేసిన ఆర్సీబీ, చికారాను మాత్రం విడుదల చేసింది. అయితే అతడిని ఏ ఇతర ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. ఆర్సీబీలో ఉన్నంతకాలం చికారాకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.
యూపీలో జన్మించిన 20 ఏళ్ల స్వస్తిక్ చికారాను ఆర్సీబీ 2024 సీజన్లో కొనుగోలు చేసింది. కుడిచేతి వాటం ఓపెనర్ అయిన చికారా, విరాట్ కోహ్లిని దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తాడన్న పేరుంది. జట్టులో ఉన్న సమయంలో ఎప్పుడూ విరాట్ వెంటే తిరుగుతూ ఉండేవాడని, అతని అతి వినయం కొన్ని సందర్భాల్లో కోహ్లిని కూడా అసహనానికి గురి చేసిందన్న ప్రచారం ఉంది.
మొత్తంగా యశ్ దయాల్, స్వస్తిక్ చికారా ఘటనలు ఆర్సీబీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వ్యవహారంపై ఫ్రాంచైజీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో వారి బ్యాక్గ్రౌండ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని యాజమాన్యానికి సూచిస్తున్నారు.
కాగా, 17 ఏళ్ల నిరీక్షణ అనంతరం గత సీజన్లోనే ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ను సాధించింది. ఫైనల్లో పంజాబ్పై విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. ఈ ఘనతను జట్టు ఆటగాళ్లు విరాట్ కోహ్లికి అంకితమిచ్చారు. టైటిల్ విజయంలో కోహ్లి పాత్ర ఎంతో కీలకమైంది. సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ కలను నిజం చేశాడు.
అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో బెంగళూరు ఆర్సీబీకి హోం గ్రౌండ్గా కొనసాగే అర్హత కోల్పోయే అవకాశముందన్న చర్చ కూడా మొదలైంది. ఈ విషాద ఘటనపై విరాట్ కోహ్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని తెలియజేశాడు.
మరిన్ని వార్తలు చదవండి: Virat Kohli: సచిన్ సరసన నిలిచిన కోహ్లి.. వన్డేల్లో మరో గొప్ప రికార్డ్