IPL

Bangladesh Allegations on T20 World Cup 2026 ICC Gives Strong Response

by Krishna R

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ మరోసారి భారత్‌పై ఆరోపణలు చేసింది. భద్రతా కారణాలను చూపుతూ, ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లను భారత్‌కు పంపలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీకి రెండు సార్లు లేఖలు కూడా రాసింది.

ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వేదికల మార్పుపై పంపిన లేఖలకు ఇప్పటివరకు సమాధానం రాలేదని చెప్పాడు. అయితే ఐసీసీ భద్రతా బృందం నుంచి తమకు ఓ లేఖ వచ్చిందని, అందులో మూడు కీలక విషయాలు పేర్కొన్నారని వెల్లడించాడు.

నజ్రుల్ తెలిపిన వివరాల ప్రకారం, ముస్తాఫిజుర్ రహమాన్ బంగ్లాదేశ్ జట్టులో ఉంటే భద్రతా ముప్పు పెరుగుతుందని ఐసీసీ భద్రతా బృందం పేర్కొన్నట్లు చెప్పాడు. అలాగే బంగ్లాదేశ్‌కు మద్దతుగా అభిమానులు జెర్సీలు ధరించి మైదానానికి వస్తే దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించినట్లు తెలిపాడు. అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారవచ్చని పేర్కొన్నారని వివరించాడు. ఈ వ్యాఖ్యలతో టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లడం సురక్షితం కాదని బంగ్లాదేశ్ అభిప్రాయపడింది.

ఐసీసీ నుంచి గట్టి కౌంటర్

అయితే ఆసిఫ్ నజ్రుల్ వ్యాఖ్యలను ఐసీసీ తీవ్రంగా ఖండించింది. ఐసీసీ వర్గాలు మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు ఐసీసీ భద్రతా నివేదికలను వక్రీకరిస్తూ వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నాయి. అంతర్జాతీయ స్థాయి భద్రతా నిపుణులతో ఐసీసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశాయి.

భారత్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడకూడదని ఎక్కడా తాము చెప్పలేదని ఐసీసీ స్పష్టం చేసింది. భారత్‌లో భద్రతా ముప్పు లేదని, ఉన్నా అది అతి తక్కువ స్థాయిలోనే ఉంటుందని వెల్లడించింది. గతంలో భారత్‌లో ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లు విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ప్రత్యక్ష దాడుల ముప్పు ఉందని తమ భద్రతా విభాగం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది.

ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఐసీసీ

పిటిఐ అందించిన సమాచారం ప్రకారం, భారత్‌లో భద్రత అంశంపై ఐసీసీ మరియు బీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆసిఫ్ నజ్రుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ముస్తాఫిజుర్ రహమాన్ ఎంపిక వల్ల భద్రతా ముప్పు ఉంటుందని ఎలాంటి అధికారిక లేఖలో పేర్కొనలేదని స్పష్టం చేశాయి.

ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు పెరగడం, భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు రావడం నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2026లో ఉన్న ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు రావడంతో బీసీసీఐ అంగీకరించింది. దీనినే ఆధారంగా చేసుకుని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ వేదికల మార్పు కోసం ఒత్తిడి చేస్తోంది.

మరిన్నివార్తలుచదవండిIND vs NZ: వాషింగ్టన్ సుందర్ గాయం.. టీమిండియా జట్టులో యువ ఆటగాడు