BCCI Increases Match Fees for Domestic Women Cricketers by 2.5 Times

దేశవాళీ మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుభవార్త అందించింది. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ బీసీసీఐ కీలకమైన, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవాళీ స్థాయిలో మహిళా క్రికెటర్లు కూడా పురుషులతో సమానంగా వేతనాలు అందుకోనున్నారు.
గతంతో పోలిస్తే మ్యాచ్ ఫీజులు దాదాపు 2.5 రెట్లు పెరగడం విశేషం. ఈ విప్లవాత్మక మార్పుకు సోమవారం (డిసెంబర్ 22) వర్చువల్గా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అధికారిక ఆమోదం లభించింది.
కొత్త ఫీజుల ప్రకారం, సీనియర్ మహిళా క్రికెటర్లు వన్డేలు, బహుళ రోజుల టోర్నీల్లో ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటే ఇకపై రోజుకు రూ.50,000 మ్యాచ్ ఫీజుగా అందుకోనున్నారు. ఇప్పటివరకు ఇది కేవలం రూ.20,000 మాత్రమే ఉండేది. అంటే ఒక్కరోజుకు దాదాపు రూ.30,000 పెరుగుదల నమోదైంది. తుది జట్టులో చోటు దక్కని ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్కు రూ.25,000 లభించనుంది. గతంలో ఈ మొత్తం రూ.12,500 మాత్రమే.
అలాగే సీనియర్ మహిళా క్రికెటర్లు టీ20 మ్యాచ్లలో ఆడితే రోజుకు రూ.25,000 మ్యాచ్ ఫీజు అందుకోనున్నారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ.10,000గా ఉంది. ఇక రిజర్వ్ ఆటగాళ్లకు రూ.12,500 చొప్పున చెల్లించనున్నారు. గతంలో ఒక సీనియర్ మహిళా క్రికెటర్ అన్ని ఫార్మాట్లలో లీగ్ మ్యాచ్లు ఆడితే సుమారు రూ.3 లక్షల వరకు మాత్రమే సంపాదించేది. తాజా నిర్ణయంతో ఆ ఆదాయం గణనీయంగా పెరగనుంది.
జూనియర్ మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్
బీసీసీఐ ఈ నిర్ణయాన్ని కేవలం సీనియర్లకే పరిమితం చేయకుండా జూనియర్ మహిళా క్రికెటర్లకూ వర్తింపజేసింది. జూనియర్ వన్డేలు, బహుళ రోజుల టోర్నీల్లో ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్న ఆటగాళ్లు రోజుకు రూ.25,000 అందుకోనున్నారు.
ఇప్పటివరకు ఇది రూ.10,000 మాత్రమే. రిజర్వ్ ఆటగాళ్లకు రూ.12,500 చెల్లించనున్నారు. అదే విధంగా జూనియర్ టీ20 మ్యాచ్ల్లో ఆడే ఆటగాళ్లకు రూ.12,500, రిజర్వ్ ఆటగాళ్లకు రూ.6,250 చొప్పున ఫీజు అందనుంది.
అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు కూడా లాభం
ఈ పెంపు కేవలం ఆటగాళ్లకే పరిమితం కాలేదు. దేశవాళీ క్రికెట్లో విధులు నిర్వర్తించే అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ఫీజులను కూడా బీసీసీఐ పెంచింది. క్రిక్బజ్ కథనం ప్రకారం, లీగ్ మ్యాచ్లకు రోజుకు రూ.40,000 వరకు, నాకౌట్ మ్యాచ్లకు రోజుకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు ఫీజు చెల్లించనున్నారు.
మొత్తానికి మహిళా క్రికెట్కు గౌరవం, సమానత్వం తీసుకొచ్చే దిశగా బీసీసీఐ మరో కీలక అడుగు వేసిందనే చెప్పాలి. ఈ నిర్ణయం దేశవాళీ మహిళా క్రికెటర్లలో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా భవిష్యత్తులో మరింత ప్రతిభ వెలుగులోకి రావడానికి దోహదపడనుంది.
మరిన్ని వార్తలు చదవండి: రోహిత్–కోహ్లీ రీఎంట్రీ ఎప్పుడు? టీమిండియా కొత్త ఏడాది ఫుల్ షెడ్యూల్ ఇదే