BCCI Puts India Tour of Bangladesh on Hold Amid Political Unrest

భారత పురుషుల క్రికెట్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే మరోసారి ఈ పరిమిత ఓవర్ల సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమిండియా పర్యటనను బీసీసీఐ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ అధికారి ధ్రువీకరించారు.
ఆ అధికారి మాట్లాడుతూ
బంగ్లాదేశ్ పర్యటనను ఇప్పటివరకు ఖరారు చేయలేదని, గత ఏడాది కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదని తెలిపారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరగనున్న అంతర్జాతీయ సిరీస్ల షెడ్యూల్ను ప్రకటించినప్పటికీ, భారత జట్టు పర్యటన మాత్రం అనుమానంగానే ఉందని చెప్పారు.
ఈ టూర్పై తుది నిర్ణయం తీసుకునే ముందు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాలకు వెళ్లి మ్యాచ్లు ఆడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, అందువల్ల పరిస్థితులను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే టీ20 ప్రపంచకప్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్లు భారత్లోనే జరగనున్నాయని తెలిపారు.
మళ్లీ వాయిదా పడే సూచనలు
భారత్–బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్బాల్ సిరీస్ షెడ్యూల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. కానీ దాని వెంటనే బీసీసీఐ నుంచి ఊహించని షాక్ వచ్చింది. నిజానికి ఈ సిరీస్ గత ఏడాది ఆగస్టులో జరగాల్సి ఉండగా, అప్పట్లో బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్కు వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఫిబ్రవరిలో భారత్కు రానుంది.
ముస్తాఫిజుర్పై బీసీసీఐ కీలక నిర్ణయం
ఇదే సమయంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్కతా నైట్ రైడర్స్కు బీసీసీఐ సూచించినట్లు సమాచారం. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ను కేకేఆర్ రూ.9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
కానీ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడకూడదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేకేఆర్ యాజమాని షారుఖ్ ఖాన్పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముస్తాఫిజుర్ను విడుదల చేయాలని బీసీసీఐ కేకేఆర్ను సూచించినట్లు తెలుస్తోంది.
మరిన్నివార్తలుచదవండి: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీకి అగ్నిపరీక్ష! ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయితేనే టీమిండియా అవకాశం