
క్రికెట్ మైదానంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ (59) ఆకస్మికంగా మరణించారు. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజ్షాహీ జట్టుతో మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు.
ఈ ఆకస్మిక మరణంతో ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు, జట్టు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జకీకి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయన అకాల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని జట్టు అధికారులు తెలిపారు.
ఆయన మృతికి సంతాపంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు మరియు అధికారులు ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం మ్యాచ్ యథావిధిగా కొనసాగింది.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం ప్రకటించింది. దేశ క్రికెట్కు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల అభివృద్ధికి మహబూబ్ అలీ జకీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడింది.
ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్గా రాణించిన జకీ, కొమిల్లా జిల్లాకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు దేశంలోని ప్రముఖ క్లబ్ అబాహనీ లిమిటెడ్ తరఫున కూడా ఆడారు. కోచ్గా ఆయన చేసిన సేవలు బంగ్లాదేశ్ క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మరిన్నివార్తలుచదవండి: రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగింపు.. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్...