రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగింపు.. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్...

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్లో ఇంగ్లండ్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్టోక్స్ సేన నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్లో కంగారూల ఆధిక్యాన్ని కొంత తగ్గించింది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఐదు టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అయితే పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ వేదికలపై జరిగిన తొలి మూడు టెస్టుల్లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయాలు చవిచూసింది. దీంతో 3-0తో సిరీస్ను ఆస్ట్రేలియా ముందుగానే కైవసం చేసుకోగా, ఇంగ్లండ్ జట్టు తీవ్ర విమర్శల పాలైంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో దెబ్బగా ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలోనే మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. శుక్రవారం ప్రారంభమైన ఈ నాలుగో టెస్ట్ అనూహ్యంగా రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యువ పేసర్ జోష్ టంగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 152 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ ఆనందం ఇంగ్లండ్కు ఎక్కువసేపు నిలవలేదు. తొలి రోజే తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 110 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, ఆసీస్ పేసర్లు నాసర్ నాలుగు, స్కాట్ బోలాండ్ మూడు, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ను ఛిన్నాభిన్నం చేశారు. తొలి రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది.
4/0 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 128 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 46 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 24 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడు, జోష్ టంగ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒక వికెట్ తీసుకున్నారు. ఆసీస్ను 34.3 ఓవర్లలో 132 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులు కలుపుకొని మొత్తం 175 పరుగుల లక్ష్యాన్ని సాధించింది.
పేసర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం సవాల్ అయినప్పటికీ, ఇంగ్లండ్ బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో ఆడారు. ఓపెనర్లు జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) మంచి ఆరంభం అందించగా, వన్డౌన్లో వచ్చిన బ్రైడన్ కార్స్ విఫలమయ్యాడు.
మధ్యలో జేకబ్ బెతెల్ 40 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, జో రూట్ 15 పరుగులు చేశాడు. కెప్టెన్ స్టోక్స్ మరోసారి నిరాశపరిచినా, హ్యారీ బ్రూక్ 18 పరుగులతో అజేయంగా నిలిచి జేమీ స్మిత్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జై రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు తీశారు. చివరకు ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
మరిన్ని వార్తలు చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇక టైటిల్ ఆశలు ముగిసినట్టేనా?
తరచుగా అడిగే ప్రశ్నలు
ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.