India Beat Pakistan in U19 World Cup 2026, Qualify for Semifinals

అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 1న జరిగిన కీలక మ్యాచ్లో భారత్, పాకిస్తాన్పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్కు కూడా అర్హత సాధించి టైటిల్ దిశగా మరో అడుగు వేసింది.
బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది 68 పరుగులతో బాధ్యతాయుతమైన అర్ధసెంచరీ సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. చివరి ఓవర్లలో కనిష్క్ చౌహాన్ 35, ఖిలన్ పటేల్ 21 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడి స్కోర్ను మరింత పెంచారు.
భారత బ్యాటింగ్లో ఆరోన్ జార్జ్ 16, కెప్టెన్ ఆయుశ్ మాత్రే ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. అభిగ్యాన్ కుందు 16, దీపేశ్ దేవేంద్రన్ 1 పరుగుకే పెవిలియన్ చేరారు. వైభవ్ సూర్యవంశీ 30, విహాన్ మల్హోత్రా 21, అంబ్రిష్ 29 పరుగులతో ఓ మోస్తరు సహకారం అందించారు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ సయ్యద్ 2 వికెట్లు సాధించాడు. అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.
252 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఆరంభంలో ఆశాజనకంగా కనిపించింది. అయితే మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు మ్యాచ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఖిలన్ పటేల్ 3 వికెట్లు, ఆయుశ్ మాత్రే 3 వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు. కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీసారు. పేసర్లు అంబ్రిష్, హెనిల్ పటేల్ కూడా కీలక వికెట్లు సాధించారు. ఫలితంగా పాకిస్తాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.
పాకిస్తాన్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్ 66 పరుగులతో ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ 42, కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 38 పరుగులతో కొంతమేర పోరాడినా మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాకిస్తాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా, గ్రూప్ 2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్కు అర్హత సాధించాయి.
గ్రూప్ 1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్త్లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనుండగా, ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ను ఎదుర్కోనుంది.
మరిన్నివార్తలుచదవండి: దేవదత్ పడిక్కల్ విధ్వంసకర శతకం, కర్ణాటకకు రంజీ ట్రోఫీలో కీలక విజయం