India wins the Blind Women’s T20 World Cup but players receive minimal reward
శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రఖ్యాత పి. సారా ఓవల్ మైదానంలో ఆదివారం (నవంబర్ 23) భారత అంధ మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని అందుకుంది. మహిళల కోసం తొలిసారిగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ ఫర్ ది బ్లైండ్–2025 ఫైనల్లో భారత్, నేపాల్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇది కేవలం ఒక టైటిల్ మాత్రమే కాదు అంధ మహిళా క్రీడాకారిణుల ధైర్యం, శ్రమ, పట్టుదలకు దక్కిన గొప్ప గౌరవం.
ఈ టోర్నమెంట్ మొత్తం భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కొనసాగి ఛాంపియన్గా నిలవడం ప్రత్యేకమైన విషయం.
అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచ కప్ గెలిచినప్పుడు లభించే భారీ ప్రైజ్ మనీతో పోలిస్తే, ఈ అంధ మహిళా జట్టుకి మాత్రం చాలా తక్కువ మొత్తమే ప్రకటించబడింది. ఇటీవల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా జట్టుకు కోట్లాదిగా బహుమతులు వెల్లువెత్తాయి. కానీ ఈ చారిత్రక విజయాన్ని అందించిన అంధ మహిళా జట్టులోని ప్రతి క్రీడాకారిణికి కేవలం ఒక లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతిని చింటల్స్ గ్రూప్ ప్రకటించింది.
ఇక క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రైజ్ మనీ ప్రకటించలేదు. జట్టు భారత్కు తిరిగి వచ్చిన తర్వాత CABI లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశముంది. దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చిన అంధ క్రీడాకారిణులకు మరింత ప్రోత్సాహం, మెరుగైన ప్రైజ్ మనీ అందించాల్సిన అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే భారత కెప్టెన్ దీపిక టాస్ గెలుచుకొని బౌలింగ్ ఎంచుకోవడం పూర్తిగా సరైన నిర్ణయంగా మారింది. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో నేపాల్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులకే పరిమితమైంది. 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన భారత్, 12.1 ఓవర్లలోనే మ్యాచ్ను వన్సైడ్గా ముగించింది.
భారత్ విజయంలో ఫూలా సరెన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 27 బంతుల్లో నాటౌట్ 44 పరుగులు చేసి జట్టుకు ధీటైన ఆరంభాన్ని అందించింది. కరుణ కే కూడా అదే తరహాలో 27 బంతుల్లో 42 పరుగులతో కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దరి ఘన ప్రదర్శనతో భారత్ సునాయాసంగా ప్రపంచ కప్ను తమ పేరుపై రాసుకుంది.
మరిన్ని వార్తలు చదవండి: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26: రుతురాజ్ గైక్వాడ్కు షాక్.. మహారాష్ట్రకు కొత్త కెప్టెన్గా పృథ్వీ షా