IPL

Jadeja ODI Retirement Buzz Ahead of 3rd ODI vs New Zealand

by Krishna R

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపు (జనవరి 18) జరగనున్న నిర్ణయాత్మక మూడో మ్యాచ్ అనంతరం టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడన్న ప్రచారం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా వన్డే భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తుండగా… అవన్నీ మరికొద్ది గంటల్లోనే స్పష్టత పొందే అవకాశం ఉంది.

వరుస వైఫల్యాలతో పెరిగిన ఒత్తిడి

ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌లో జడేజా తొలి రెండు వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 56 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ కేవలం 4 పరుగులకే పరిమితమయ్యాడు. రెండో వన్డేలో బ్యాటింగ్‌లో 44 బంతుల్లో 27 పరుగులు చేసి కొంతమేర తృప్తిపరిచినా… బౌలింగ్‌లో మాత్రం 8 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి వికెట్ సాధించలేకపోయాడు. అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్‌లోనూ బంతితో జడేజా తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల నేపథ్యంలో జడేజాపై వన్డే రిటైర్మెంట్‌కు సంబంధించిన ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్‌లో ఇంకా తన క్లాస్‌ను నిరూపిస్తూనే ఉన్నా… వన్డేల్లో మాత్రం గత కొంతకాలంగా స్థిరమైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

మూడో వన్డేనే చివరిదా?

వాస్తవానికి న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేనే జడేజాకు చివరిది అన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఎందుకంటే ఆ మ్యాచ్‌కు వేదిక అయిన రాజ్‌కోట్ జడేజాకు హోం గ్రౌండ్. అయితే ఆ మ్యాచ్ తర్వాత అతను ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేకు ముందు మరోసారి జడేజా రిటైర్మెంట్ వార్తలు ఊపందుకున్నాయి.

ఇటీవల టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాట్లాడుతూ… “జడేజా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం జట్టుకు ఉపయోగపడతాడు” అని వ్యాఖ్యానించినప్పటికీ, వన్డే రిటైర్మెంట్‌పై జడేజా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు.

గణాంకాలు, భవిష్యత్

37 ఏళ్ల జడేజా ఇప్పటివరకు 209 వన్డేలు ఆడి 2,893 పరుగులు చేయడంతో పాటు 232 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతను వన్డేలకు వీడ్కోలు పలికితే, అతని స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్షర్ వన్డే ఫార్మాట్‌లో తన స్థానం కోసం బలమైన వాదన వినిపిస్తుండటంతో… జడేజా రిటైర్మెంట్ తర్వాత అతను రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉంది.

ఇండోర్ వన్డే ముగిసిన తర్వాత జడేజా నుంచి అధికారిక ప్రకటన వస్తుందా? లేదా అన్నది ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్నగా మారింది.

మరిన్ని వార్తలు చదవండి: బిగ్ బాష్ లీగ్‌లో స్టీవ్ స్మిత్ విధ్వంసం.. సిడ్నీ సిక్సర్స్‌కు వరుసగా 4వ విజయం