MS Dhoni & Rohit Sharma to Retire After IPL 2026? Reports Suggest Two More Stars Joining the List

ఐపీఎల్ ప్రతిసారి ప్రారంభం కాబోతుందంటే ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న వార్తలు తప్పకుండా వస్తూనే ఉంటాయి. 2020లో కరోనా సమయంలోనే ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని ప్రచారం మొదలైంది. కానీ ఈ ఐదేళ్లుగా ఆయన అన్ని ఊహాగానాలను తోసిపుచ్చుతూ నిరంతరం ఆడుతూనే ఉన్నాడు.
అయితే 2026 ఐపీఎల్ సీజన్ మాత్రం నిజంగానే ధోనికి చివరిది అయ్యే అవకాశం ఉందన్న సమాచారాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఓ వ్యక్తి వెల్లడించినట్టు తెలుస్తోంది. అతని పేరు మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ధోనిని జట్టు రిటైన్ చేసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ను తీసుకోవడం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. సంజూ జట్టుకు వచ్చిన వెంటనే అతనే వచ్చే కెప్టెన్ అయ్యే అవకాశాల గురించి వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ధోనికి ఇదే చివరి సీజన్ అన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది.
ధోని 2026 ఐపీఎల్ ఆడతాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఇదే ధోనీ చివరి ఐపీఎల్ కావచ్చని జట్టు వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి. కారణాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి. ధోనీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అలాగే సంజూ శాంసన్ను తీసుకోవడం వికెట్ కీపింగ్ బాధ్యతలు మరియు భవిష్యత్ కెప్టెన్సీకి సిద్ధం చేసే నిర్ణయంగా భావిస్తున్నారు. అంటే ధోనీకి తర్వాత సీఎస్కేను నడిపించేది సంజూనే అన్న అభిప్రాయం బలపడుతోంది.
ధోనీతో పాటు మరికొందరు భారత ఆటగాళ్లకు కూడా రాబోయే సీజన్ చివరిదై ఉండొచ్చు.
ఇషాంత్ శర్మ గత రెండు సీజన్లుగా ఫామ్ కోల్పోయాడు. గత సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ కూడా ఎక్కువగా ఉంది. ఫిట్నెస్ మరియు వయస్సు కారణంగా ఇషాంత్ 2026 తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెప్పే అవకాశం కనిపిస్తోంది.
అజింక్య రహానే గత ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కెప్టెన్గా ఆడాడు. అతను పదకొండు మ్యాచ్ల్లో మంచి పరుగులు చేసినా జట్టును ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లలేకపోయాడు. ఈ కారణంగా రహానే కూడా రాబోయే సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించవచ్చని జట్టు సన్నిహితులు చెబుతున్నారు.
రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ 20లకు వీడ్కోలు చెప్పాడు. ఇప్పుడు ఐపీఎల్ కూడా ముగించుకుని పూర్తిగా వన్డేలపై దృష్టి పెట్టాలని చూస్తున్నాడని సమాచారం. రాబోయే వన్డే ప్రపంచకప్ను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.
బీసీసీఐ ఇంకా అధికారిక షెడ్యూల్ ప్రకటించకపోయినా ఐపీఎల్ 2026 మార్చి చివరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇది నిజంగా ధోనీ చివరి సీజన్ అయితే సీఎస్కే అభిమానులకు ఇది భావోద్వేగంతో నిండిన సీజన్ అవుతుంది.
మరిన్ని వార్తలు చదవండి: ILT20 సీజన్ 4: దుబాయ్ క్యాపిటల్స్కి కెప్టెన్గా దసున్ షానకా నియామకం