IPL

Ravi Shastri’s Big Statement on Rohit Sharma and Virat Kohli’s 2027 World Cup Chances

by Guna SRV

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20లకు వీడ్కోలు చెప్పి ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని ఈ ఇద్దరు దిగ్గజాలు భావిస్తున్నారు.

అయితే ఈ అంశంపై బీసీసీఐ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. “వారి ఫామ్, ఫిట్నెస్ నిలకడగా ఉంటే… ఎందుకు ఆడకూడదు?” అనే మాదిరి స్టేట్‌మెంట్ మాత్రమే ఇస్తోంది. అదనంగా, దేశవాళీ క్రికెట్ ఆడాలని బోర్డు అల్టిమేటంగా చెప్పిందన్న వార్తలు కూడా వేడి పుట్టిస్తున్నాయి. దీనితో కావాలనే ఈ ఇద్దరి భవిష్యత్తుపై సందేహాలు సృష్టిస్తున్నారంటూ భారత జట్టు యాజమాన్యం పై విమర్శలు పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రోహిత్, కోహ్లీ భవిష్యత్‌పై గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన హెచ్చరించారు. వన్డే క్రికెట్‌లో లెజెండ్స్‌గా నిలిచిన ఈ ఇద్దరితో అనవసరమైన సమస్యలు సృష్టించడం అస్సలు మంచిది కాదని స్పష్టం చేశారు.

రోహిత్-కోహ్లీ భవిష్యత్‌పై ఈ కలకలం ఎవరు రేపుతున్నారన్న ప్రశ్నకు రవిశాస్త్రి స్పందిస్తూ…
“చేసేవారు చేస్తున్నారు… దీనిపై అంతే చెప్పగలను. ఒక్కసారి విరాట్‌, రోహిత్ ఫామ్ అందుకుంటే ఈ డ్రామాకి ఫుల్‌స్టాప్ పడిపోతుంది.”
అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్పష్టంగా సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించినవేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక క్రికెట్ పరంగా చూస్తే

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు బాదుతూ పాత కింగ్‌ఫామ్‌ను తిరిగి తెచ్చుకున్నాడు.

ఈ సిరీస్‌లో కీలకమైన మూడో, తుదివన్డే డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇప్పటికే టీమిండియా విశాఖకు చేరుకుంది. తొలి వన్డేలో భారత్ గెలిచింది, రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో నిర్ణయాత్మక విశాఖ వన్డేపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు చదవండి: England vs Australia: ‘నగ్నంగా నడుస్తానన్న సవాల్’.. హేడెన్ పరువు కాపాడిన జో రూట్ సెంచరీ!