Rohit Sharma Reveals He Considered Retirement After 2023 World Cup Final Loss

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమి తర్వాత తాను నిజంగా రిటైర్మెంట్ గురించి ఆలోచించానని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరిగిన ఆ ప్రపంచకప్లో రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు అద్భుతంగా దూసుకెళ్లింది.
లీగ్ దశలో వరుసగా తొమ్మిది విజయాలు సాధిస్తూ అజేయంగా నిలిచిన భారత్, ఫైనల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోగా, ప్రపంచకప్ ట్రోఫీ ఆస్ట్రేలియా చేతికి చేరింది.
డిసెంబర్ 21న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్, ప్రపంచకప్ గెలవడమే తన ఒక్కటే లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో తీవ్రంగా కుంగిపోయానని భావోద్వేగంగా వెల్లడించాడు. “ఆ ఓటమి తర్వాత మళ్లీ నన్ను నేను సర్దుబాటు చేసుకోవడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. అప్పటి పరిస్థితి మాటల్లో చెప్పలేనంత కఠినంగా ఉండేది” అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే తన ముందు 2024 టీ20 ప్రపంచకప్ ఉందని గుర్తించి, ఆ లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు.
“ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఈ మాటలు చెప్పడం సులభంగా అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో మాత్రం చాలా బాధ కలిగింది. ఒక దశలో ఈ ఆటనే వదిలేయాలనే ఆలోచన కూడా వచ్చింది. క్రికెట్ నా నుంచి అన్నింటినీ తీసుకెళ్లిందనే భావన కలిగింది” అని రోహిత్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు.
అయితే, ఏడాది గడిచేలోపే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రోహిత్ పేర్కొన్నాడు. 2024 టీ20 ప్రపంచకప్లో భారత జట్టును విజేతగా నిలిపి తన కలను నెరవేర్చుకున్నానని చెప్పాడు. ఆ ఘన విజయం తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినట్లు వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే భారత్ మరో ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత జట్టు టైటిల్ను గెలుచుకుంది.
ఇదిలా ఉండగా, వన్డే జట్టుకు కెప్టెన్గా కొనసాగుతాడని భావించిన రోహిత్కు సెలెక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్మన్ గిల్కు ఆ బాధ్యతలు అప్పగించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్, రోహిత్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో మాత్రమే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అయితే, 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. ఈలోగా, దేశవాళీ క్రికెట్లో తిరిగి లయ సాధించేందుకు రోహిత్ సిద్ధమవుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ముంబై జట్టు తరఫున మళ్లీ మైదానంలోకి దిగేందుకు అతడు రెడీ అవుతున్నాడు.
మరిన్ని వార్తలు చదవండి: యాషెస్ సిరీస్ 2025-26: ఓటమి తర్వాత బెన్ స్టోక్స్ వేదన – “మా కల అక్కడితో ముగిసింది”