IPL

Shreyas Iyer Returns in Vijay Hazare Trophy, Appointed Mumbai Captain

by Krishna R

గాయం కారణంగా కొద్ది రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహ్యాబ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న శ్రేయాస్, దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొననున్నాడు.

ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్న శ్రేయాస్ అయ్యర్, జనవరి 6న హిమాచల్ ప్రదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. అంతేకాకుండా, జనవరి 8న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అతడే ముంబై జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ ఈ టోర్నీ మొత్తానికి దూరమవ్వడంతో, ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) శ్రేయాస్ అయ్యర్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించింది.

“విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన లీగ్ మ్యాచ్‌లకు ముంబై సీనియర్ పురుషుల జట్టుకు శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు ప్రకటించడం మాకు ఆనందంగా ఉంది” అని MCA సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.

ముంబై నాకౌట్ ఆశలు

ప్రస్తుతం ముంబై జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడి, నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఎలైట్ గ్రూప్ సీలో 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, వాటిలో కనీసం ఒక్క మ్యాచ్‌లో గెలిచినా ముంబై నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది.

శ్రేయాస్ అయ్యర్‌కు కూడా కీలక మ్యాచ్‌లు

ఈ మ్యాచ్‌లు ముంబై జట్టుకే కాకుండా, శ్రేయాస్ అయ్యర్‌కు కూడా ఎంతో కీలకంగా మారాయి. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు.

అయితే, ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే అతడు కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని జట్టును ప్రకటించిన సందర్భంగా సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయాస్ పాల్గొనే ఈ రెండు మ్యాచ్‌ల్లో అతడి ఫిట్‌నెస్‌పై సెలెక్టర్ల కళ్లన్నీ ఉండనున్నాయి.

మరిన్నివార్తలుచదవండిటీ20 వరల్డ్ కప్ 2026: బంగ్లా స్క్వాడ్‌లో ఊహించని మార్పులు..లిటన్ దాస్ కెప్టెన్గా