IPL

Top 5 Richest Indian Cricketers in 2025 – Net Worth Revealed

by Guna SRV

భారతదేశంలో అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే క్రీడల జాబితాలో క్రికెట్ ముందువరుసలో నిలుస్తుంది. దేశంలోని అగ్రశ్రేణి క్రికెటర్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు, ఐపీఎల్ జీతాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడుల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఆడుతున్న ఆటగాళ్లలో 2025 ముగిసే నాటికి వివిధ నివేదికల ఆధారంగా అత్యంత ధనవంతులైన టాప్–5 భారత క్రికెటర్లు వీరే.

హార్దిక్ పాండ్యా

అత్యంత సంపన్న భారత క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా ఒకరు. 2025 నాటికి అతడి నికర ఆస్తి విలువ సుమారు రూ.91 నుంచి రూ.98 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. బీసీసీఐ గ్రేడ్–ఏ కాంట్రాక్ట్ కలిగిన హార్దిక్‌కు ఏటా రూ.5 కోట్ల వేతనం లభిస్తుంది.

దీనికి తోడు మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కూడా అతడి ఆదాయాన్ని పెంచుతున్నాయి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడిని రూ.16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.

జస్ప్రీత్ బుమ్రా

భారత ఫాస్ట్ బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా నికర ఆస్తి విలువ 2025 నాటికి రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్యగా అంచనా వేయబడుతోంది. అతడి ఆదాయంలో ప్రధాన భాగం బీసీసీఐ గ్రేడ్ A+ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచే వస్తుంది.

ఈ కాంట్రాక్ట్ ద్వారా బుమ్రాకు సంవత్సరానికి రూ.7 కోట్ల జీతం లభిస్తుంది. ఐపీఎల్‌లో కూడా కీలక ఆటగాడిగా ఉన్న అతడిని ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లకు రిటైన్ చేసింది.

రిషభ్ పంత్

స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 2025 నాటికి సుమారు రూ.100 కోట్ల నికర ఆస్తి విలువ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. బీసీసీఐ గ్రేడ్–ఏ సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న పంత్‌కు ఏటా రూ.5 కోట్ల జీతం అందుతుంది. మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు అతడి ఆదాయాన్ని మరింత పెంచుతున్నాయి. ఐపీఎల్‌లో జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

రోహిత్ శర్మ

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దేశంలోనే అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకరు. 2025 నాటికి అతడి నికర ఆస్తి విలువ రూ.215 నుంచి రూ.230 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. బీసీసీఐ గ్రేడ్ A+ ఆటగాడిగా ఉన్న రోహిత్‌కు ఏటా రూ.7 కోట్ల వేతనం లభిస్తుంది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అతడికి ప్రతి సీజన్‌కు సుమారు రూ.16.3 కోట్లు చెల్లిస్తుంది. వీటికి తోడు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ఒప్పందాలు, పెట్టుబడుల ద్వారా రోహిత్ ఏటా రూ.50 నుంచి రూ.60 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం.

విరాట్ కోహ్లీ

భారత క్రికెట్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లోనూ అత్యంత ధనవంతులైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలుస్తాడు. 2025 నాటికి అతడి నికర ఆస్తి విలువ దాదాపు రూ.1,050 కోట్లుగా అంచనా వేయబడుతోంది. కోహ్లీ బీసీసీఐ గ్రేడ్ A+ సెంట్రల్ కాంట్రాక్టులో ఉండటంతో ఏటా రూ.7 కోట్ల జీతం అందుకుంటాడు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అతడికి ప్రతి సీజన్‌కు రూ.21 కోట్లు చెల్లిస్తుంది. అంతేకాదు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా సహకారాలు, వ్యాపార పెట్టుబడుల ద్వారా కోహ్లీ ఏటా రూ.200 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు చదవండి: ICC ODI Rankings 2026: కోహ్లీ అగ్రస్థానం.. రోహిత్ డౌన్