U19 Asia Cup 2025: Team India Thrash Malaysia by 315 Runs, Abhigyan Kundu Hits Double Century

అండర్-19 ఆసియా కప్ 2025లో టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. పసికూన మలేషియాపై భారత జట్టు ఘన విజయం సాధించి, ఏకంగా 315 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మిగిల్చింది. మంగళవారం (డిసెంబర్ 16) దుబాయ్లోని 7వ సెవెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత ఆధిపత్యం పూర్తిగా కనిపించింది.
వికెట్కీపర్ అభిజ్ఞాన్ కుండు డబుల్ సెంచరీతో (125 బంతుల్లో 209 పరుగులు) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయానికి మూలస్తంభంగా నిలిచాడు. బౌలర్లు కూడా అద్భుతంగా రాణించి భారత విజయాన్ని మరింత ఘనంగా మలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో మలేషియా కేవలం 93 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. టీ20 తరహా ఆటతీరుతో భారత బ్యాటర్లు తొలి ఓవర్ల నుంచే దూసుకెళ్లారు. అయితే వేగంగా ఆడే క్రమంలో ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా వికెట్లను జట్టు త్వరగా కోల్పోయింది.
ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది కలిసి 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ను స్థిరపరిచారు. దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ కేవలం 26 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 87 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అయితే అసలు ఆట ఇక్కడ నుంచే మొదలైంది.
అభిజ్ఞాన్ కుండు, వేదాంత్ త్రివేది జతకట్టి మలేషియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ను శరవేగంగా ముందుకు నడిపించారు. ముఖ్యంగా కుండు దూకుడుకు మలేషియా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వీరిద్దరూ మూడో వికెట్కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
90 పరుగులు చేసిన వేదాంత్ త్రివేది దురదృష్టవశాత్తూ సెంచరీకి కేవలం 10 పరుగుల దూరంలో ఔటయ్యాడు. మరో ఎండ్లో మాత్రం కుండు విధ్వంసం ఆగలేదు. సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచి డబుల్ సెంచరీ మైలురాయిని చేరుకున్నాడు.
చివరి వరకు క్రీజ్లో నిలిచిన అభిజ్ఞాన్ కుండు తన దూకుడైన ఆటను కొనసాగించడంతో భారత స్కోర్ 408 పరుగులకు చేరింది. అతడు 125 బంతుల్లో 209 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన మలేషియా కనీస పోటీ కూడా ఇవ్వలేక దారుణంగా కుప్పకూలింది.
దీపేష్ దేవేంద్రన్ ఐదు వికెట్లు తీసి చెలరేగడంతో ఒక దశలో మలేషియా జట్టు 38 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. హంజా పంగి చేసిన 35 పరుగులు మాత్రమే భారత్ విజయాన్ని స్వల్పంగా ఆలస్యం చేశాయి. మొత్తానికి, ఈ మ్యాచ్లో టీమిండియా సర్వతోముఖ ఆధిపత్యం చాటుతూ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
మరిన్ని వార్తలు చదవండి: వరల్డ్ కప్ హీరోకి భారీ ఎదురుదెబ్బ.. అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు