
భారీ అంచనాల మధ్య పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. అండర్-19 ఆసియా కప్-2025లో భాగంగా దాయాదితో జరిగిన ఈ మ్యాచ్లో అతడు కేవలం ఐదు పరుగులకే ఔటయ్యాడు. కీలక పోరులో వైభవ్ వైఫల్యం చెందడంతో భారత అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 గ్రూప్ ‘ఎ’లో భాగంగా భారత్–పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ నిర్వహించారు. వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలగడంతో టాస్ ఆలస్యమైంది. పరిస్థితులు మెరుగుపడడంతో మ్యాచ్ను 49 ఓవర్లకు కుదిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో జరిగిన ఈ పోరులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. గత మ్యాచ్లో యూఏఈపై విఫలమైన కెప్టెన్ ఆయుష్ మాత్రే ఈసారి ఆత్మవిశ్వాసంగా ఆడుతూ ఇన్నింగ్స్కు శుభారంభం అందించాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం తొలి నుంచే తడబడ్డాడు.
పాకిస్తాన్ తరఫున బౌలింగ్ను ప్రారంభించిన అలీ రెజా తొలి ఓవర్లో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్లో నాలుగో బంతికి ఆయుష్ మాత్రే పరుగు తీశాడు. రెండో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్లో ఆయుష్ ఫోర్, సిక్స్, ఫోర్తో దూకుడు చూపించగా.. వైభవ్ మాత్రం ఇంకా ఖాతా తెరవలేకపోయాడు.
మూడో ఓవర్లో మళ్లీ అలీ రెజా బంతి అందుకోగా, తొలి బంతినే బౌండరీకి తరలించి వైభవ్ కొంత టచ్లోకి వచ్చినట్లు కనిపించాడు. ఆ తర్వాత ఆయుష్ కూడా అదే ఓవర్లో రెండు ఫోర్లు బాది స్కోర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే నాలుగో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ అనూహ్యంగా వైభవ్ను బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు.
దీంతో ఆరు బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులకే ఔటయ్యాడు. అతడి స్థానంలో హైదరాబాదీ యువ ఆటగాడు ఆరోన్ జార్జ్ క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.
గత మ్యాచ్లో యూఏఈపై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన 171 పరుగుల శతకం బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే సెమీఫైనల్ చేరడానికి అత్యంత కీలకమైన పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ వైఫల్యం అతడికి ఒక కఠినమైన పరీక్షగా మారింది.
మరిన్ని వార్తలు చదవండి: టాప్-5లో లేకపోయినా ప్రాధాన్యత కావాలి.. ICCపై పీసీబీ ఫిర్యాదు