టాప్-5లో లేకపోయినా ప్రాధాన్యత కావాలి.. ICCపై పీసీబీ ఫిర్యాదు

ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్కు మరోసారి అవమానకర పరిస్థితి ఎదురైంది. ఈసారి ఆ వివాదానికి కారణం ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) చేసిన తప్పిదమే కావడం గమనార్హం. 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి ఐసీసీ విడుదల చేసిన ప్రచార పోస్టర్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఫోటో లేకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఐసీసీ పోస్టర్ వివాదం ఏమిటంటే?
2026 టీ20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఐసీసీ తాజాగా ఒక ప్రచార పోస్టర్ను విడుదల చేసింది. అయితే ఆ పోస్టర్లో కేవలం ఐదు దేశాల కెప్టెన్ల చిత్రాలకే చోటు కల్పించారు. అందులో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్కరం, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్, శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఉన్నారు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఫోటోను పూర్తిగా విస్మరించడమే పీసీబీ ఆగ్రహానికి కారణమైంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా పీసీబీ భావిస్తోంది.
ఐసీసీ వద్దకు వెళ్లిన పీసీబీ
ఈ అంశాన్ని పీసీబీ అధికారికంగా ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో పీసీబీకి సంబంధించిన విశ్వసనీయ వర్గాలు మాట్లాడుతూ, “ప్రచార పోస్టర్లో కేవలం ఐదు జట్ల కెప్టెన్లకే ప్రాతినిధ్యం ఇవ్వడంపై మేము అభ్యంతరం వ్యక్తం చేశాం” అని తెలిపారు.
ఇలాంటి పరిస్థితే గతంలో ఆసియా కప్ సమయంలో కూడా ఎదురైందని, అప్పట్లో బ్రాడ్కాస్టర్లు పాకిస్తాన్ కెప్టెన్ చిత్రాన్ని చేర్చకుండా ప్రచారం ప్రారంభించారని వారు గుర్తు చేశారు. ఆ సందర్భంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్తో చర్చల తర్వాతే సమస్య పరిష్కారమైందని వివరించారు.
టాప్-5లో లేకపోయినా ప్రాధాన్యత అవసరం
ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ టాప్-5 జట్లలో లేకపోయినా, ప్రపంచ క్రికెట్లో ఆ దేశానికి గొప్ప చరిత్ర ఉందని పీసీబీ స్పష్టం చేస్తోంది. ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక అభిమానులను ఆకర్షించే జట్లలో పాకిస్తాన్ ఒకటన్న విషయాన్ని ఐసీసీ గుర్తించాలంటోంది.
అందుకే ప్రచార పోస్టర్లలోనూ, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల్లోనూ పాకిస్తాన్ కెప్టెన్కు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నది పీసీబీ గట్టి అభిప్రాయం. భవిష్యత్తులో ఇలాంటి ప్రచారాల్లో తమ కెప్టెన్ను తప్పకుండా చేర్చుతారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.
మరిన్ని వార్తలు చదవండి: జియోస్టార్ ICC మీడియా రైట్స్లో కట్టుబాటు; మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ప్రసారం చేస్తుందన్నారు
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.