Virat Kohli Creates History in Vijay Hazare Trophy, Breaks Michael Bevan Record

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా సూపర్ స్టార్, ఢిల్లీ కుర్రాడు విరాట్ కోహ్లి మరోసారి తన క్లాస్ ఏంటో నిరూపిస్తున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీలో బరిలోకి దిగిన కోహ్లి, మొదటి మ్యాచ్ నుంచే అదిరిపోయే ప్రదర్శనలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్పై సంచలన సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లి, రెండో మ్యాచ్లోనూ గుజరాత్పై మ్యాచ్ను మలుపుతిప్పే కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
గుజరాత్తో జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లి 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తోనే కాదు, ఒక అరుదైన ప్రపంచ రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకుని క్రికెట్ చరిత్రలో మరో ఘనతను జోడించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాడిగా విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటివరకు లిస్ట్-ఏ క్రికెట్లో కోహ్లి 57.87 సగటుతో మొత్తం 16,207 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్-ఏ కెరీర్లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీతో కోహ్లి ఆ రికార్డును స్వల్ప తేడాతో అధిగమించి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటు సాధించిన టాప్ బ్యాటర్లు:
విరాట్ కోహ్లి (భారత్) – 57.87 సగటు, 16,207 పరుగులు
మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా) – 57.86 సగటు, 15,103 పరుగులు
సామ్ హైన్ (ఇంగ్లండ్) – 57.76 సగటు, 3,004 పరుగులు
ఛతేశ్వర్ పుజారా (భారత్) – 57.01 సగటు, 5,759 పరుగులు
రుతురాజ్ గైక్వాడ్ (భారత్) – 56.68 సగటు, 4,648 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి 77 పరుగులతో రాణించగా, కెప్టెన్ రిషబ్ పంత్ 70 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి జట్టును నిలబెట్టాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైశ్వాల్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకోగా, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 47.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, సౌరవ్ చౌహన్ 49, ఉర్విల్ పటేల్ 31 పరుగులతో పోరాడారు. ఢిల్లీ బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా తలా రెండు వికెట్లు సాధించారు.
మ్యాచ్ మొత్తంలో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దేశవాళీ క్రికెట్కు తిరిగి వచ్చి కూడా అదే స్థాయిలో సత్తా చాటుతూ, కింగ్ కోహ్లి ఇంకా తన ఆకలి తగ్గలేదని మరోసారి స్పష్టం చేశాడు.
మరిన్ని వార్తలు చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇక టైటిల్ ఆశలు ముగిసినట్టేనా?