Virat Kohli Creates History with 28000 Runs Emotional Story About His Mother

వడోదర వన్డేలో విరాట్ కోహ్లీ కేవలం మ్యాచ్ను గెలిపించడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించే క్రమంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర రికార్డును కూడా అధిగమించాడు. ఈ మ్యాచ్లో 93 పరుగులతో అద్భుతంగా ఆడిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారే కోహ్లీ, నిజ జీవితంలో మాత్రం ఎంతో సున్నితమనస్కుడు. ముఖ్యంగా తన తల్లిపై ఆయనకు ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనంత గొప్పది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లోనూ కోహ్లీ 93 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ అనంతరం ప్రెజెంటర్ హర్షా భోగ్లే సరదాగా విరాట్ను ఒక ప్రశ్న అడిగారు. ఇప్పటికే నీకు 45 వన్డే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి. వాటన్నింటినీ ఉంచేందుకు నీ ఇంట్లో ప్రత్యేక గది కావాలేమో అని హర్షా నవ్వుతూ అడిగారు. దీనికి కోహ్లీ చాలా భావోద్వేగంగా స్పందించాడు.
నేను పొందిన ప్రతి అవార్డును గురుగ్రామ్లో ఉన్న మా అమ్మ దగ్గరకు పంపిస్తాను. ఆ ట్రోఫీలను భద్రంగా దాచుకోవడం ఆమెకు చాలా ఇష్టం. నా విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడుతుంది. అందుకే నా అవార్డులన్నీ ఆమె దగ్గరే ఉంటాయి అని కోహ్లీ చిరునవ్వుతో చెప్పాడు.
వడోదర వన్డేలో సాధించిన విజయం కోహ్లీ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా, కోహ్లీ 28,068 పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల సంఖ్యలోనూ సచిన్ 76 అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ 71 అవార్డులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ రికార్డును అందుకోవడానికి కోహ్లీకి ఇంకా ఐదు అవార్డులే మిగిలి ఉన్నాయి.
తన కెరీర్ ప్రారంభంలోనే తండ్రిని కోల్పోయిన కోహ్లీ, తల్లి నీడలో క్రమశిక్షణతో పెరిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. తన ప్రతి విజయానికి తల్లి ఆశీస్సులే కారణమని భావిస్తాడు. అందుకే తనకు వచ్చే గౌరవాలు, అవార్డులు అన్నింటినీ ఆమెకే అంకితం చేస్తుంటాడు. ఒకవైపు ప్రపంచ క్రికెట్ను శాసిస్తూనే, మరోవైపు తన మూలాలను మరువకుండా అమ్మపై ఉన్న ప్రేమను చూపించడం కోహ్లీ గొప్పతనానికి నిజమైన నిదర్శనం. రికార్డుల కంటే కూడా అమ్మ ముఖంలో కనిపించే చిరునవ్వే తనకు అత్యున్నత అవార్డు అని కోహ్లీ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది.
మరిన్నివార్తలుచదవండి: IND vs NZ 1st ODI Highlights: న్యూజిలాండ్పై విరాట్ షో.. భారత్ 4 వికెట్ల విజయం