IPL

Virat Kohli Likely to Play at Chinnaswamy Before IPL 2026

by Guna SRV

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలు పక్కాగా అమలు చేసిన తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడిగా మాజీ భారత క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం నుంచి ఈ అనుమతి లభించడం గమనార్హం. గతంలో ఐపీఎల్‌–2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ విషాద ఘటన అనంతరం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా జరగలేదు. అయితే తాజా నిర్ణయంతో మళ్లీ చిన్నస్వామి మైదానంలో అభిమానుల సందడి కనిపించనుంది.

ఐపీఎల్‌–2026 సీజన్‌కు ముందే టీమిండియా స్టార్, ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ ఈ మైదానంలో ఆడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు తిరిగి నిర్వహిస్తారని గతంలో వార్తలు వచ్చినా, ఇప్పుడు అంతకంటే ముందే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నట్లు సమాచారం అందుతోంది.

వాస్తవానికి విజయ్ హాజారే ట్రోఫీ (VHT) 2025–26 సీజన్ గ్రూప్–డి మ్యాచ్‌లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు. ఈ గ్రూప్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టు కూడా ఉంది. కోహ్లీ, పంత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఆడే మ్యాచ్‌లను అలూర్ లాంటి చిన్న వేదికలో నిర్వహిస్తే భద్రతా, లాజిస్టికల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీంతో ఢిల్లీ జట్టు ఆడే మ్యాచ్‌లను అలూర్ నుంచి చిన్నస్వామి స్టేడియానికి తరలించాలనే ఆలోచనలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ హాజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజున ఢిల్లీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడే అవకాశముంది.

మరిన్ని వార్తలు చదవండి: IND vs SA మూడో టీ20: గిల్‌కు వేటా? సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు