Who Is Vishal Jaiswal? The Bowler Who Shocked Virat Kohli and Dismissed Rishabh Pant

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ మరోసారి తన స్థాయిని చాటాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ అర్ధశతకం సాధించి ఫామ్లో ఉన్నానని స్పష్టంగా చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్ చూస్తున్న అభిమానులు మరో సెంచరీ ఖాయమని భావించారు. కానీ, ఆ అంచనాలన్నింటికీ అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు గుజరాత్ యువ స్పిన్నర్ విశాల్ జైస్వాల్. పెద్దగా ఎవరికీ తెలియని ఈ బౌలర్, ఒక్కసారిగా కోహ్లీతో పాటు రిషబ్ పంత్ వికెట్లను పడగొట్టి వార్తల్లో నిలిచాడు.
బెంగళూరులో జరిగిన ఢిల్లీ – గుజరాత్ మ్యాచ్లో కోహ్లీ పూర్తి ఆధిపత్యం చూపించాడు. 58 బంతుల్లో 77 పరుగులు చేస్తూ గుజరాత్ బౌలర్లపై దాడి చేశాడు. 13 ఫోర్లు, ఒక సిక్సర్తో స్కోర్బోర్డ్ పరుగులు పెట్టిస్తూ రెండో సెంచరీ దిశగా సాగుతున్న తరుణంలో, విశాల్ జైస్వాల్ వేసిన ఓ తెలివైన బంతి మ్యాచ్ను మలుపు తిప్పింది.
సిక్సర్ కొట్టాలనే ఉద్దేశంతో క్రీజ్ దాటి ముందుకు వచ్చిన కోహ్లీ, బంతి టర్న్ అవడంతో పూర్తిగా మిస్ అయ్యాడు. కీపర్ చాకచక్యంగా స్పందించి క్షణాల్లో స్టంప్లు ఎగిరవేశాడు. ఒక్కసారిగా స్టేడియంలో నిశ్శబ్దం అలుముకుంది.
కోహ్లీ వికెట్తోనే విశాల్ ఆగలేదు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు మరో ఇద్దరు కీలక టాప్ ఆర్డర్ బ్యాటర్లను కూడా పెవిలియన్కు పంపాడు. తన 10 ఓవర్ల స్పెల్లో కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి, నాలుగు విలువైన వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ను కుదిపేశాడు. ఈ ప్రదర్శనతో దేశవాళీ క్రికెట్ వర్గాల్లో విశాల్ జైస్వాల్ పేరు ఒక్కసారిగా మారుమోగుతోంది.
గుజరాత్కు చెందిన ఈ యువ ఆల్రౌండర్ రికార్డులు చూస్తే అతడి ప్రతిభ అర్థమవుతుంది. 2022–23 సీజన్లో జరిగిన అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో విశాల్ అసాధారణంగా రాణించాడు. కేవలం 20 ఇన్నింగ్స్ల్లోనే 70 వికెట్లు పడగొట్టి టోర్నీని ఊపేశాడు.
ఏకంగా ఏడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గానూ 2024లో బీసీసీఐ వార్షిక అవార్డుల్లో జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా ప్రత్యేక అవార్డును అందుకున్నాడు.
ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన విశాల్, బౌలింగ్లో 40 వికెట్లు తీసుకోవడంతో పాటు బ్యాటింగ్లో ఒక శతకం కూడా నమోదు చేశాడు. పూర్తి స్థాయి ఆల్రౌండర్గా తనను తాను నిరూపించుకుంటున్న ఈ యువకుడికి, విరాట్ కోహ్లీ వికెట్ ఒక టర్నింగ్ పాయింట్గా మారడం ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ ద్వారా వెలుగులోకి వచ్చిన విశాల్ జైస్వాల్ పేరు ఇక దేశవాళీ క్రికెట్లో ఎక్కువకాలం వినిపించనుంది.
మరిన్ని వార్తలు చదవండి: ఫ్యాన్ దురుసు వ్యాఖ్యలు చేశాడు.. కానీ హార్దిక్ పాండ్యా స్పందన మాత్రం క్లాస్!