
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఓ అభిమాని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనకు సెల్ఫీ ఇవ్వలేదన్న కారణంతో ఆ అభిమాని హార్దిక్ను నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంతేకాదు నాశనమైపోతావ్ అంటూ శాపనార్థాలు కూడా పెట్టాడు. అయితే ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోని హార్దిక్ పాండ్యా ఎంతో ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అభిమాని ఎంత తీవ్రంగా దూషించినా హార్దిక్ పాండ్యా నిశ్చలంగా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చిన్న చిన్న విషయాలకే హార్దిక్ సహనం కోల్పోతాడని అభిమానులకు తెలిసిందే. మైదానంలో సహచర ఆటగాడు క్యాచ్ వదిలినా లేదా ఫీల్డింగ్లో నిర్లక్ష్యం చేసినా వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాడు. అలాంటి హార్దిక్ పాండ్యా ఓ అభిమాని బహిరంగంగా తిట్టినా స్పందించకుండా వెళ్లిపోవడం చాలామందిని షాక్కు గురిచేస్తోంది.
అసలు ఏమి జరిగిందంటే
ముంబైలోని ఓ హోటల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హార్దిక్ పాండ్యా తన నయా గర్ల్ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి హాజరయ్యాడు. కార్యక్రమం ముగిశాక ఇద్దరూ హోటల్ నుంచి బయటకు వస్తుండగా అభిమానులు సెల్ఫీల కోసం గుమిగూడారు. ముందుగా మహికా శర్మను కారులో కూర్చోబెట్టిన హార్దిక్ పాండ్యా కొంతమంది అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు. ఓ అభిమాని అయితే హార్దిక్ భుజాలపై చేయి వేసి మరీ సెల్ఫీ దిగడం గమనార్హం.
𝗚𝘂𝘆𝘀, 𝘁𝗵𝗶𝘀 𝗶𝘀 𝗴𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝗧𝗢𝗢 𝗠𝗨𝗖𝗛 🤬🙏
— Jara (@JARA_Memer) December 25, 2025
A fan tried to approach Hardik Pandya for a selfie but couldn’t get close.
𝗙𝗮𝗻: 𝗕𝗛𝗔𝗔𝗗 𝗠𝗘 𝗝𝗔𝗢 (Go to Hell) 😡
𝗛𝗮𝗿𝗱𝗶𝗸: Either didn’t hear it, or heard it and chose to ignore.
This incident happened… pic.twitter.com/B929w11Iwi
అయినా హార్దిక్ ఎక్కడా అసహనం చూపలేదు. అయితే అభిమానులు అదుపు తప్పి ముందుకు రావడంతో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని హార్దిక్ను కారులోకి ఎక్కించారు. ఈ క్రమంలో తనకు సెల్ఫీ దక్కలేదన్న కోపంతో ఓ అభిమాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. సహనం కోల్పోయిన అతడు నాశనమైపోతావ్ అంటూ గట్టిగా అరిచాడు. అయినా హార్దిక్ పాండ్యా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కోహ్లీ బుమ్రా కూడా ఇలాగే
ఇటీవలి కాలంలో భారత క్రికెటర్లతో కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. వారి వ్యక్తిగత గోప్యతను పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఆటగాళ్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటీవల విమానాశ్రయంలో జస్ప్రీత్ బుమ్రా వద్దని చెబుతున్నా వినకుండా ఓ అభిమాని సెల్ఫీ వీడియో తీసేందుకు ప్రయత్నించడంతో బుమ్రా తీవ్రంగా స్పందించాడు. ఆ అభిమాని చేతిలోని ఫోన్ను లాగి కింద పడేశాడు.
అలాగే విరాట్ కోహ్లీ వద్ద కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించగా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనల నేపథ్యంలో ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది.
మరిన్నివార్తలుచదవండి: BPL 2025-26లో కలకలం: ప్రాక్టీస్ మధ్యలో అలిగి ఆటోలో బయటకు వచ్చిన నోయాఖాలీ ఎక్స్ప్రెస్ కోచ్లు!