బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనాన్స్ కమిటీ చైర్మన్గా ఉన్న నజ్ముల్ ఇస్లాంను తక్షణ ప్రభావంతో ఆ బాధ్యతల నుంచి తొలగించింది. దేశంలోని క్రికెటర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, అలాగే క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (సీడబ్ల్యూఏబీ) ఇచ్చిన కఠిన హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నజ్ముల్ను తొలగించకపోతే దేశవ్యాప్తంగా ఆటలను బహిష్కరిస్తామని సీడబ్ల్యూఏబీ స్పష్టం చేసింది.
ఈ వివాదం మొదలైనది నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో. ఇరవై ఓవర్ల ప్రపంచకప్–2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే, ఆటగాళ్లకు ఎలాంటి పరిహారం ఇవ్వబోమని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆటగాళ్లు సరిగా ఆడకపోయినా బోర్డు ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలను తిరిగి చెల్లించమని అడగడం లేదని, అలాంటప్పుడు వారికి ఆర్థిక భద్రత ఎందుకు ఇవ్వాలన్న వాదన కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి.
దాని ప్రభావం వెంటనే కనిపించింది. జనవరి 15న జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్లు నోఖాలి ఎక్స్ప్రెస్ వర్సెస్ చటోగ్రామ్ రాయల్స్, రాజ్షాహీ వారియర్స్ వర్సెస్ సిల్హెట్ టైటాన్స్ — ఆటగాళ్ల నిరసనతో వాయిదా పడ్డాయి. బీపీఎల్ కెప్టెన్లు నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిదీ హసన్ మిరాజ్, మహెదీ హసన్ వంటి సీనియర్ ఆటగాళ్లు నజ్ముల్ రాజీనామా చేయాలన్న డిమాండ్కు బహిరంగంగా మద్దతిచ్చారు.
తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం
మొదట బీసీబీ నజ్ముల్కు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ, రోజంతా పరిస్థితులు ఉధృతంగా మారడంతో చివరికి కఠిన చర్యకు దిగింది. నజ్ముల్ తొలగింపుతో బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం తాత్కాలికంగా ఫైనాన్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో దేశంలో క్రికెట్ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఏర్పడింది.
ఈ విషయంపై బీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 ప్రకారం ఉన్న అధికారాలను వినియోగించి, ఫైనాన్స్ కమిటీ చైర్మన్గా ఉన్న నజ్ముల్ ఇస్లాంను తక్షణమే బాధ్యతల నుంచి విడుదల చేయాలని బీసీబీ అధ్యక్షుడు నిర్ణయించారు. బోర్డు కార్యకలాపాలు సజావుగా కొనసాగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు,” అని పేర్కొంది.
అలాగే ఆటగాళ్లకు భరోసా ఇస్తూ, “క్రికెటర్ల ప్రయోజనాలే బీసీబీకి అత్యున్నత ప్రాధాన్యం. ఈ క్లిష్ట సమయంలో అందరూ వృత్తిపరమైన నిబద్ధతతో, బంగ్లాదేశ్ క్రికెట్ అభివృద్ధికి అంకితభావంతో వ్యవహరిస్తారని, బీపీఎల్లో నిరంతరంగా పాల్గొంటారని బోర్డు ఆశిస్తోంది,” అని స్పష్టం చేసింది.
T20 వరల్డ్ కప్ 2026 ముందు వీసా వివాదం – ఇంగ్లాండ్ స్టార్లకూ ఇబ్బందులు