తప్పుడు పత్రాలు, ఫోర్జరీ ఆరోపణలు మరియు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఆయనను పదవి నుంచి తొలగించారు.
హెచ్సీఏ కొత్త అధ్యక్షుడు అమర్నాథ్, జగన్మోహన్ రావు పదవి నుంచి తొలగింపు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్ను అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు జగన్మోహన్ రావును తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
2023 అక్టోబర్ 20న జరిగిన హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో అమర్నాథ్ ఒక్క ఓటు తేడాతో జగన్మోహన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రావుకు 63 ఓట్లు రాగా, అమర్నాథ్కు 62 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రావు తప్పుడు పత్రాలు సమర్పించి, మోసపూరిత మార్గాల్లో విజయం సాధించారని ఆరోపిస్తూ అమర్నాథ్ అంబుడ్స్మన్ను ఆశ్రయించారు.
తన ఫిర్యాదులో అమర్నాథ్ కీలక అంశాలను ప్రస్తావించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా పేరు మార్చడాన్ని 2018 జనవరి 31న అప్పటి అంబుడ్స్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చట్టవిరుద్ధమని ప్రకటించారని గుర్తు చేశారు. అందువల్ల శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు చట్టపరమైన ఉనికే లేదని తెలిపారు. అయినప్పటికీ జగన్మోహన్ రావు తన పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేసి, డబ్బులు చెల్లించి, ఆ క్లబ్కు సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేసి కోశాధికారిగా వ్యవహరిస్తూ అక్రమంగా ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపించారు.
ఈ వాదనలను పరిశీలించిన అనంతరం అంబుడ్స్మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ అమర్నాథ్ వాదనలతో ఏకీభవించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదని స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికే ఆయనను హెచ్సీఏ సస్పెండ్ చేసిన విషయం, ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు నిర్వహించడం లేదన్న అంశాలను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హెచ్సీఏ అధ్యక్ష పదవిని ఎక్కువకాలం ఖాళీగా ఉంచడం సాధ్యం కాదని పేర్కొన్న అంబుడ్స్మన్, పిటిషనర్ అయిన అమర్నాథ్ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు. ఒక వారంలోపు బాధ్యతలు స్వీకరించాలని అమర్నాథ్ను ఆదేశించారు. మిగిలిన పదవీకాలం సుమారు తొమ్మిది నెలల పాటు అమర్నాథ్ హెచ్సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇక ఫోర్జరీ, అవినీతి ఆరోపణలపై గతంలో జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. ఈ కారణంగానే హెచ్సీఏ ఆయనను ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఇప్పటివరకు తాత్కాలిక అధ్యక్షుడిగా సర్దార్ దల్జీత్ సింగ్ కొనసాగుతుండగా, తాజా అంబుడ్స్మన్ ఉత్తర్వులతో అమర్నాథ్ త్వరలోనే అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అమర్నాథ్ కేంద్ర ఎక్సైజ్ శాఖలో మాజీ ఉన్నతాధికారిగా పనిచేశారు. అలాగే హెచ్సీఏలో అత్యంత సీనియర్ సభ్యులలో ఒకరిగా మంచి గుర్తింపు కలిగి ఉన్నారు.
మరిన్నివార్తలుచదవండి: టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్లో ఒమన్ సంచలనం, శ్రీలంక ‘ఎ’పై ఘన విజయం
తరచుగా అడిగే ప్రశ్నలు
అమర్నాథ్ను హెచ్సీఏ కొత్త అధ్యక్షుడిగా అంబుడ్స్మన్ ప్రకటించారు.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.