ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ప్రారంభించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత జట్టు ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత బౌలర్ల ప్రభావానికి 18 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌట్ అయింది.
కంగారూ జట్టులో జార్జియా వేర్ హామ్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. లిచ్ ఫీల్డ్ 26 పరుగులు చేయగా పెర్రీ 20 పరుగులతో సహకరించింది. భారత పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనానికి కారణమైంది. ఆమెతో పాటు మరో తెలుగు అమ్మాయి శ్రీ చరణి రెండు వికెట్లు సాధించగా పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కూడా రెండు వికెట్లు తీశింది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్ షఫాలీ వర్మ వేగవంతమైన ఆరంభం ఇచ్చింది. ఆమె కేవలం 11 బంతుల్లో రెండు సిక్సర్ల సహాయంతో 21 పరుగులు చేసి ఔటైంది. భారత జట్టు ఐదు ఓవర్లు ఒక బంతి ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.
వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితాన్ని ప్రకటించారు. ఆట నిలిచిన సమయంలో భారత్ 21 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో భారత జట్టును విజేతగా నిర్ణయించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 19న కాన్బెర్రా వేదికగా జరగనుంది.
మరిన్నివార్తలుచదవండి: టి20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ 24: దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ హైలైట్స్