అన్ని

ఐపీఎల్ 2026 రిటెన్షన్ పూర్తైంది: ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత పర్స్ మనీ ఉంది? పూర్తి లిస్ట్

ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక పర్స్‌తో అడుగుపెట్టబోయే జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్. శనివారం, అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను విడుదల చేయగా, కేకేఆర్ మాత్రం పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ, స్టార్ ఆటగాళ్లను కూడా వదులుకుంది. ముఖ్యంగా ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్‌లను రిలీజ్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో కేకేఆర్ పర్స్ మొత్తం రూ.64.3 కోట్లకు పెరిగి, ఈ వేలంలో అత్యధికంగా నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం కేవలం రూ.2.75 కోట్ల పర్స్‌తోనే బిడ్డింగ్‌కు సిద్ధమైంది.

ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. దానికి ముందుగానే నవంబర్ 15న అన్ని పది జట్లు తమ రిటెన్షన్ లిస్టులను ప్రకటించాయి. కొన్ని జట్లు పెద్ద ఎత్తున ఆటగాళ్లను విడుదల చేశాయి. ముఖ్యంగా కేకేఆర్ తమ అత్యంత కీలక ఆటగాడు రస్సెల్ (12 కోట్లు)ను, అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (23.75 కోట్లు)కు కొనుగోలు అయిన వెంకటేశ్ అయ్యర్‌ను కూడా వదులుకోవడంతో పర్స్‌ను భారీగా ఖాళీ చేసుకుంది.

ఇక ఇతర జట్లు కూడా తమ ముఖ్యమైన ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2026 వేలానికి ముందున్న పర్స్ (రూ. కోట్లలో)

జట్టు పర్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ 64.3
చెన్నై సూపర్ కింగ్స్ 43.4
సన్‌రైజర్స్ హైదరాబాద్ 25.5
లక్నో సూపర్ జెయింట్స్ 22.95
ఢిల్లీ క్యాపిటల్స్ 21.8
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16.4
రాజస్థాన్ రాయల్స్ 16.05
గుజరాత్ టైటాన్స్ 12.9
పంజాబ్ కింగ్స్ 11.5
ముంబై ఇండియన్స్ 2.75

జట్లలో ఖాళీల వివరాలు

జట్టు ఖాళీ స్థానాలు
కోల్‌కతా నైట్ రైడర్స్ 13
సన్‌రైజర్స్ హైదరాబాద్ 10
చెన్నై సూపర్ కింగ్స్ 9
రాజస్థాన్ రాయల్స్ 9
ఢిల్లీ క్యాపిటల్స్ 8
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8
లక్నో సూపర్ జెయింట్స్ 6
ముంబై ఇండియన్స్ 5
గుజరాత్ టైటాన్స్ 5
పంజాబ్ కింగ్స్ 4

మొత్తం చూసుకుంటే, ఐపీఎల్ 2026 మినీ వేలం ముందుగా జట్లు చేస్తున్న రిటెన్షన్ వ్యూహాలు ఈసారి పోటీ మరింత ఆసక్తికరంగా మారనున్నాయని సూచిస్తున్నాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ పర్స్‌తో కొత్త ఆటగాళ్లను దక్కించుకునే అవకాశాలు పెంచుకున్న నేపథ్యంలో, ఇతర జట్లు కూడా తమ బెస్ట్ కాంబినేషన్ కోసం ముందుగానే సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 16న జరిగే వేలంలో ఏ జట్లు ఎవరిని తీసుకుంటాయి, ఎలాంటి సర్ప్రైజ్ బిడ్డింగ్ జరుగుతుందనే ఉత్కంఠ ఇప్పటికే పెరిగింది.

మరిన్ని చదవండి: భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో 5 టీ20 సిరీస్ ఆడనుంది, బంగ్లాదేశ్ పర్యటన వాయిదా
LastModified Date: 2025-11-21 15:31:18
Krishna R
Krishna R

I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.

నవీకరణలు