రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన హోమ్ షెడ్యూల్పై అధికారిక స్పష్టత ఇచ్చింది. మొత్తం ఏడు హోమ్ మ్యాచ్లలో నాలుగు పోటీలు జైపూర్లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మైదానం రాజస్థాన్ జట్టు సంప్రదాయ హోమ్ గ్రౌండ్గా కొనసాగుతోంది.
అయితే గత కొన్ని సీజన్లలో ఫ్రాంచైజీ తమ మ్యాచ్లను జైపూర్తో పాటు గువాహటి నగరంలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో కూడా నిర్వహిస్తూ రెండు వేదికల మధ్య విభజించింది. ఈసారి కూడా మూడు మ్యాచ్లు గువాహటిలో జరగనున్నాయి.
వేదిక మార్పుపై చర్చలకు కారణం రాజస్థాన్ క్రికెట్ సంఘం వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తాత్కాలిక కమిటీతో ఫ్రాంచైజీకి విభేదాలు నెలకొన్నాయి. టాటా ప్రాజెక్ట్స్ నిర్వహించిన స్వతంత్ర ఆడిట్ తర్వాత మౌలిక వసతులు, అభిమానుల భద్రత అంశాలపై రాజస్థాన్ రాయల్స్ ఆందోళనలు వ్యక్తం చేసింది.
బెంగళూరు ఘటన తర్వాత పెరిగిన జాగ్రత్తలు
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా భద్రత అంశాలపై జాగ్రత్త వైఖరి అవలంబించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఏడాది బెంగళూరులో జరిగిన దుర్ఘటన తర్వాత స్టేడియం భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాలని బోర్డు భావించినట్లు తెలుస్తోంది. అయితే రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలి మాత్రం పెద్ద సమస్యలేమీ లేవని, చిన్నపాటి మరమ్మతులు చాలు అని స్పష్టం చేసింది.
జైపూర్ నుంచి అన్ని మ్యాచ్లను తరలించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఫ్రాంచైజీ చైర్పర్సన్ రంజిత్ బర్తాకూర్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను కలిసిన తర్వాత ఒక మధ్యంతర ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దాని ప్రకారం 2026 సీజన్లో నాలుగు మ్యాచ్లు జైపూర్లో, మూడు గువాహటిలో నిర్వహించేందుకు అంగీకరించారు.
గత సీజన్తో పోలిస్తే జైపూర్కు ఒక మ్యాచ్ తక్కువైనా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కొంత మేర విజయం అన్న భావన వ్యక్తమవుతోంది. మొదట ఫ్రాంచైజీ పూర్తి భద్రత హామీ లేకుండా ఏ మ్యాచ్నూ ఆడదలచుకోలేదని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, సవాయి మాన్ సింగ్ స్టేడియంలో అవసరమైన మరమ్మతులు, అప్గ్రేడ్ పనులు ప్రారంభమయ్యాయి. భద్రత, నిర్వహణ ప్రమాణాలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండు వర్గాలు మధ్యలో ఒక సామరస్యానికి రావడంతో, వచ్చే సీజన్లోనూ జైపూర్ రాజస్థాన్ రాయల్స్ హోమ్ క్యాలెండర్లో కీలక భాగంగా నిలవనుంది.
సూపర్–8లో స్పిన్ సవాలు: సౌతాఫ్రికా ముందు టీమ్ ఇండియా పెద్ద పరీక్ష