అన్ని

టీ20 ప్రపంచకప్‌ 2026: భారత్‌కు బంగ్లాదేశ్ రాదా? జనవరి 21న కీలక నిర్ణయం

T20 World Cup 2026: Will Bangladesh Tour India? ICC Sets January 21 Deadline

టీ20 ప్రపంచకప్‌–2026లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వస్తుందా లేదా అన్న అంశం జనవరి 21న తేలనుంది. భద్రతా కారణాలను ముందుకు తెచ్చి, ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం తమ జట్టును భారత్‌కు పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండిపట్టు పట్టిన విషయం తెలిసిందే. భారత్‌లో కాకుండా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే పలుమార్లు ఐసీసీకి బీసీబీ విజ్ఞప్తి చేసింది.

అయితే టోర్నీ ప్రారంభానికి ఇంత సమీపంలో షెడ్యూల్‌ను మార్చడం సాధ్యం కాదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బీసీబీ మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ అంగీకరిస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వడానికి జనవరి 21ని తుది గడువుగా నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ఆ తేదీ వరకూ బీసీబీ తన మొండిపట్టును వీడకపోతే, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలో చేర్చాలని ఐసీసీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం బంగ్లాదేశ్ తర్వాత జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. అయితే జింబాబ్వే, ఐర్లాండ్ ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. దీంతో తదుపరి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు బంగ్లాదేశ్ స్థానంలో అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా బంగ్లాదేశ్–భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతలు క్రికెట్‌పైనా ప్రభావం చూపించాయి. ఐపీఎల్‌ 2026కు ముందు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, బీసీసీఐ ఆదేశాల మేరకే కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ పరిణామాన్ని ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, తమ జట్టును ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపబోమని స్పష్టం చేస్తూ, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీపై ఒత్తిడి తెస్తోంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించడమూ ఈ వివాదానికి మరో మలుపుగా మారింది.

షెడ్యూల్ ప్రకారం చూస్తే, టీ20 ప్రపంచకప్‌–2026లో బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలుగా ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అన్నది జనవరి 21 తర్వాతే స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు చదవండి: విరాట్ కోహ్లీ సెంచరీ వృథా సచిన్ రికార్డు బద్దలు కొట్టేందుకు ఇంకా ఎన్ని సెంచరీలు కావాలి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q. టీ20 ప్రపంచకప్‌ 2026లో బంగ్లాదేశ్ భారత్‌కు వస్తుందా?
A.

ఇప్పటివరకు స్పష్టత లేదు. ఐసీసీ జనవరి 21ను తుది గడువుగా నిర్ణయించింది. 

Guna SRV
Guna SRV

I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.

నవీకరణలు