Vijay Hazare Trophy 2025-26: పంజాబ్ ఘన విజయం, ఢిల్లీ చిత్తు సెమీఫైనల్స్కు చేరిన నాలుగు జట్లు

విజయ్ హజారే ట్రోఫీ 2025–26 టోర్నీ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. మంగళవారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ముగియడంతో సెమీఫైనల్స్కు అర్హత సాధించిన జట్లు ఖరారయ్యాయి. బెంగళూరు వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో పంజాబ్ జట్టు అద్వితీయ ప్రదర్శనతో మధ్యప్రదేశ్పై 183 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 88 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అన్మోల్ప్రీత్ సింగ్ 70 పరుగులు, నేహల్ వధేరా 56 పరుగులు, హర్నూర్ సింగ్ 51 పరుగులతో అర్ధ సెంచరీలు నమోదు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, త్రిపురేష్ సింగ్ తలా రెండు వికెట్లు తీసి కాస్త ప్రతిఘటన చూపించారు.
భారీ లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన మధ్యప్రదేశ్ బ్యాటింగ్ లైనప్ పంజాబ్ బౌలర్ల దాటికి పూర్తిగా కూలిపోయింది. 31.2 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌటైంది. పాటిదార్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచినా, ఇతర బ్యాటర్లు పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. పంజాబ్ బౌలింగ్లో సంవీర్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకోగా, గుర్నూర్ బ్రార్, రమణ్దీప్ సింగ్, కృష్ భగత్ తలా రెండేసి వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
మరోవైపు నాలుగో క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు ఢిల్లీపై 76 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్కు అర్హత సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు ప్రయత్నించిన ఢిల్లీ, విదర్భ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలవలేక 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. నచికేత్ భూటే నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ పతనానికి ప్రధాన కారణమయ్యాడు.
ఇదివరకే జరిగిన తొలి రెండు క్వార్టర్ ఫైనల్స్లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక, సౌరాష్ట్ర, విదర్భ, పంజాబ్ జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి.
సెమీఫైనల్ షెడ్యూల్
తొలి సెమీఫైనల్: కర్ణాటక vs విదర్భ – జనవరి 15
రెండో సెమీఫైనల్: సౌరాష్ట్ర vs పంజాబ్ – జనవరి 16
ఇప్పుడు ఈ నాలుగు జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరులు అభిమానులకు మరింత ఉత్కంఠను అందించనున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి: T20 వరల్డ్ కప్ 2026పై బంగ్లాదేశ్ మొండితనం – భారత్కు రావడానికి నిరాకరణ
తరచుగా అడిగే ప్రశ్నలు
కర్ణాటక, సౌరాష్ట్ర, విదర్భ, పంజాబ్ జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి.
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.