అన్ని

బీబీఎల్ అరంగేట్రంలోనే అవమానం.. అంపైర్ నిర్ణయంతో పాకిస్థాన్ పేసర్ ఔట్!

పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌గా పేరున్న షాహీన్ షా అఫ్రిది‌కు ఊహించని అవమానం ఎదురైంది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసిన కారణంగా ఫీల్డ్ అంపైర్ అతడి బౌలింగ్‌ను మధ్యలోనే నిలిపివేశాడు. ఓవర్ పూర్తయ్యేలోపే అతడిపై సస్పెన్షన్ విధిస్తూ కఠిన చర్యలు తీసుకున్నాడు.

ఈ ఘటన ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకోవడం విశేషం. ఈ అనూహ్య పరిణామంతో అఫ్రిది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అంతేకాదు, బీబీఎల్‌లో షాహీన్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షాహీన్ షా అఫ్రిది, సోమవారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఈ వివాదంలో చిక్కుకున్నాడు. మెల్‌బోర్న్ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఒకే ఓవర్‌లో రెండు బీమర్లు వేయడంతో అంపైర్ అతడిని సస్పెండ్ చేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని హై ఫుల్‌టాస్‌గా వేయగా అది నేరుగా బ్యాటర్ హెల్మెట్‌ను తాకింది. వెంటనే అంపైర్ నోబాల్ ప్రకటించి తొలి బీమర్‌గా హెచ్చరిక ఇచ్చాడు.

అయితే నాలుగో బంతిని కూడా ఆఫ్‌సైడ్ వైపు ఫుల్‌టాస్‌గా విసరడంతో అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాడు. ఇక ఐదో బంతిని మరోసారి ప్రమాదకరమైన బీమర్‌గా వేయడంతో అంపైర్ నోబాల్ ఇచ్చి, అదే సమయంలో షాహీన్‌ను మిగిలిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకే ఓవర్‌లో రెండు బీమర్లు వేస్తే, ఆ బౌలర్‌ను ఆ మ్యాచ్ మొత్తం మళ్లీ బౌలింగ్ చేయకుండా నిషేధిస్తారు. షాహీన్ షా అఫ్రిది విషయంలో కూడా అదే నియమాన్ని అమలు చేశారు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. షాహీన్ మ్యాచ్ ఫీజులో కోత పడే అవకాశమూ ఉందని తెలుస్తోంది. అతడి ఓవర్‌ను మిగతా భాగంలో మెక్‌స్వీనీ పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది 2.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 43 పరుగులు ఇచ్చాడు. అతడి స్పెల్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉండగా, 2 వైడ్స్‌, 3 నోబాల్స్‌ నమోదయ్యాయి. బీబీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సస్పెన్షన్‌కు గురవడంతో షాహీన్‌పై సోషల్ మీడియా వేదికగా జోకులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. పాక్ ప్రీమియర్ బౌలర్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అంటూ నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారీ 212 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో అద్భుతమైన సెంచరీ (102) నమోదు చేయగా, ఓలివర్ పీక్ 57 పరుగులతో అర్ధసెంచరీ సాధించి జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. 

మరిన్ని వార్తలు చదవండి: షెఫాలీ వర్మ అద్భుత ప్రయాణం వరల్డ్ కప్ ఫైనల్ హీరోగా ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్

 

Guna SRV
Guna SRV

I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.

నవీకరణలు