
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ మ్యాచ్లో ఉపయోగించిన పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో రెండు రోజుల్లోనే మొత్తం 36 వికెట్లు పడిపోయాయి. ఈ పోరులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
పేస్ బౌలర్లకు ఏకపక్షంగా సహకరించిన ఈ పిచ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి చర్యలు తీసుకుంది. మెల్బోర్న్ పిచ్కు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించడంతో పాటు ‘అసంతృప్తికరం’ అనే రేటింగ్ను ఇచ్చింది.
మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో మాట్లాడుతూ, “మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ బౌలర్లకు అతిగా అనుకూలంగా ఉంది. తొలి రోజు 20 వికెట్లు, రెండో రోజు 16 వికెట్లు పడిపోయాయి. ఒక్క బ్యాటర్ కూడా కనీసం అర్ధ శతకం సాధించలేకపోయాడు. అందుకే ఈ పిచ్కు అసంతృప్తికరం అనే రేటింగ్ ఇస్తూ, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయిస్తున్నాం” అని తెలిపారు.
ఐసీసీ పిచ్ రేటింగ్ విధానంలో వెరీ గుడ్, సంతృప్తికరం, అసంతృప్తికరం, అన్ఫిట్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. పిచ్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోతే ఐసీసీ డీమెరిట్ పాయింట్లు విధిస్తుంది.
అసంతృప్తికరం అనే రేటింగ్కు ఒక డీమెరిట్ పాయింట్, అన్ఫిట్ రేటింగ్కు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయిస్తారు. ఈ పాయింట్లు ఐదేళ్ల పాటు సంబంధిత మైదానం ఖాతాలో కొనసాగుతాయి. ఒక వేదికకు మొత్తం ఐదు డీమెరిట్ పాయింట్లు చేరితే, ఆ స్టేడియాన్ని ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్లకు అనర్హంగా ప్రకటిస్తారు.
పిచ్కు రేటింగ్ ఇచ్చేటప్పుడు బౌన్స్, సీమ్ మూవ్మెంట్, టర్న్, అవుట్ఫీల్డ్ పరిస్థితి వంటి అంశాలను ఐసీసీ పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా ఆటగాళ్ల భద్రతకు పిచ్ ప్రమాదకరంగా ఉందా లేదా అనే విషయాన్ని గమనిస్తారు. అయితే ఆసక్తికరంగా చెప్పాలంటే, మెల్బోర్న్ వేదికగా గత మూడు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లకు ‘వెరీ గుడ్’ రేటింగ్ లభించింది.
ఇదిలా ఉండగా, యాషెస్ సిరీస్ను ఇప్పటికే ఆస్ట్రేలియా 3–1తో కైవసం చేసుకుంది. వరుసగా మూడు టెస్టుల్లో ఆసీస్ విజయం సాధించగా, నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ గెలుపొందింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్కు ఇదే తొలి విజయం.
మెల్బోర్న్ పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లు పరుగులు చేయడం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చేసిన 46 పరుగులే ఈ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా నిలిచాయి. యాషెస్ సిరీస్లో చివరి టెస్ట్ మ్యాచ్ జనవరి 4 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది.
మరిన్నివార్తలుచదవండి: అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ: 45 సిక్సర్లతో భయోత్పాతం