
బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర లభించిన విషయం తెలిసిందే. ముస్తాఫిజుర్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 9.2 కోట్లకు సొంతం చేసుకుంది. అతని కోసం కేకేఆర్ తీవ్రంగా పోటీపడగా, చెన్నై సూపర్ కింగ్స్ కూడా చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చింది. అయినప్పటికీ కేకేఆర్ దూకుడుకు చివరికి సీఎస్కే వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ముస్తాఫిజుర్ కేకేఆర్ జట్టులో చేరినప్పటికీ, ఆ జట్టుకు ఒక చిన్న షాక్ ఎదురైంది. ఐపీఎల్ సీజన్ మధ్యలో కొన్ని రోజుల పాటు అతను జట్టుకు అందుబాటులో ఉండడు. ఏప్రిల్ నెలలో న్యూజిలాండ్తో బంగ్లాదేశ్ స్వదేశంలో వన్డే సిరీస్ జరగనుంది. బంగ్లా జట్టులో కీలక బౌలర్ అయిన ముస్తాఫిజుర్, జాతీయ బాధ్యతల కారణంగా ఆ సిరీస్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి అతను సుమారు ఎనిమిది నుంచి పది రోజుల పాటు విరామం తీసుకోనున్నాడు.
న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్ ప్రాతినిధ్యం వహించేందుకు స్వదేశానికి తిరిగివస్తాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది. అంతర్జాతీయ మ్యాచ్లు ఉండటంతో ఐపీఎల్ సీజన్ మధ్యలో ముస్తాఫిజుర్ దాదాపు ఎనిమిది నుంచి పది రోజులు అందుబాటులో ఉండడని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబెదీన్ ఫాహిమ్ తెలిపారు.
ఈ స్వల్ప విరామం మినహా, మొత్తం ఐపీఎల్ సీజన్లో ముస్తాఫిజుర్ కేకేఆర్కు అందుబాటులో ఉంటాడని కూడా ఆయన స్పష్టం చేశారు. 2027 వన్డే ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించాలంటే న్యూజిలాండ్తో జరిగే ఈ సిరీస్ బంగ్లాదేశ్కు చాలా కీలకంగా మారింది.
గమనించదగిన విషయం ఏమిటంటే, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముస్తాఫిజుర్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చినప్పటికీ, ఆ సమయంలో అతను అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అయితే ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్లేఆఫ్స్లో ఆడే అవకాశం అతనికి దక్కింది. ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ ఫ్రేజర్ మెక్గర్క్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముస్తాఫిజుర్ను జట్టులోకి తీసుకుంది.
2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్, 2022 మరియు 2023 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 38 మ్యాచ్లు ఆడిన అతను, 7.84 ఎకానమీతో 38 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20 ఫార్మాట్లో 106 మ్యాచ్లు ఆడి, 132 వికెట్లు సాధించాడు.
ముస్తాఫిజుర్ కొన్ని రోజులు అందుబాటులో లేకపోయినా, కేకేఆర్ జట్టులో ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎలాంటి లోటు కనిపించదు. శ్రీలంక యువ పేస్ సంచలనం మతీషా పతిరానాను కేకేఆర్ రూ. 18 కోట్లకు దక్కించుకుంది. దీనితో పాటు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, ఆకాష్ దీప్, కార్తీక్ త్యాగి వంటి ప్రతిభావంతమైన భారతీయ పేసర్లు ఉండటంతో కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత బలంగా కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు చదవండి: బీసీసీఐ బిగ్ షాక్: జనవరి 15 వరకు మ్యాచ్లన్నీ ఒకే వేదికలోనే