టీమిండియాకు శుభవార్త? మొహమ్మద్ షమీ రీఎంట్రీపై బీసీసీఐ కీలక సంకేతాలు

టీమిండియా అనుభవజ్ఞుడైన పేసర్ మొహమ్మద్ షమీకి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయా? త్వరలోనే అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే ప్రశ్నకు బీసీసీఐకి దగ్గరైన వర్గాల నుంచి ఇప్పుడు సానుకూల సంకేతాలే వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, షమీ ఫిట్నెస్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ ఇంకా పూర్తి ఫిట్గా లేడని, అందుకే అతడిని ఆ టూర్కు ఎంపిక చేయలేదని స్పష్టం చేశాడు. దీనికి షమీ కూడా గట్టిగానే స్పందించాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని, రంజీ ట్రోఫీలో ఆడుతున్నప్పుడు వన్డేలు ఆడటంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించాడు.
అయితే అగార్కర్ మాత్రం తన మాటపై నిలబడి, షమీ ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్ కాలేదని మరోసారి స్పష్టం చేశాడు. ఈ మాటల యుద్ధంతో పాటు షమీ మైదానంలోనూ తన ప్రదర్శనతో సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడి టీమిండియా రీఎంట్రీపై అప్పట్లో సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. తాజాగా బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ, షమీపై సానుకూలంగా స్పందించాయి. వన్డే వరల్డ్కప్ 2027కు పెద్దగా సమయం లేకపోవడంతో, అనుభవజ్ఞుడైన షమీని మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాన్ని పూర్తిగా పక్కన పెట్టలేమని పేర్కొన్నాయి.
‘‘సెలక్షన్ సమయంలో మొహమ్మద్ షమీ పేరు ఎప్పుడూ చర్చలో ఉంటుంది. అతడు ఇంకా పోటీలోనే ఉన్నాడు. బోర్డుకు ప్రధాన ఆందోళన అతడి ఫిట్నెస్ గురించే. అయితే వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలర్గా షమీని ఎవరూ విస్మరించలేరు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అతడి ఆట తీరు బాగానే ఉంది. ఒకవేళ అతడిని ఈ సిరీస్కు ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
షమీ అనుభవం కలిగిన బౌలర్. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని వికెట్లు పడగొట్టే నైపుణ్యం అతడికి ఉంది. అందుకే 2027 వన్డే ప్రపంచకప్ జట్టులోనూ అతడికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని బోర్డు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వన్డే వరల్డ్కప్ 2023లో టీమిండియా విజయాల్లో షమీ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ తన సత్తా చాటాడు. ఆ టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసి, వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. భారత్ ఆ ట్రోఫీని గెలవడంలో షమీ పాత్ర మరువలేనిది.
ఆ తర్వాత బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన షమీ, కేవలం నాలుగు మ్యాచ్ల్లోనే 20 వికెట్లు తీసి తన ఫామ్ను చాటాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు.
ఇదిలా ఉండగా, టీమిండియా – న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్కు షమీ ఎంపిక అవుతాడా లేదా అన్నది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర అంశంగా మారింది.
మరిన్ని వార్తలు చదవండి: వరల్డ్ కప్ టార్గెట్: లసిత్ మలింగకు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక బాధ్యత
తరచుగా అడిగే ప్రశ్నలు
బీసీసీఐ వర్గాల ప్రకారం షమీ ఇంకా సెలక్షన్ రాడార్లోనే ఉన్నాడు. రీఎంట్రీకి అవకాశాలు ఉన్నాయి.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.