BCCI సెంట్రల్ కాంట్రాక్టుల్లో పెద్ద మార్పు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రేడ్ Bకి దిగజారే అవకాశం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో కీలకమైన మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుత కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా పునఃసమీక్షించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో A+, A, B, C అనే నాలుగు గ్రేడ్లు అమలులో ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్లో ప్రకటించిన కాంట్రాక్టుల ప్రకారం A+ గ్రేడ్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్ల వేతనం అందుతోంది.
అదే విధంగా A గ్రేడ్లో రిషభ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున వేతనం లభిస్తోంది.
B గ్రేడ్లో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. ఈ ఆటగాళ్లకు రూ.3 కోట్ల వార్షిక వేతనం అందుతోంది.
C గ్రేడ్లో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరందరికీ ఏడాదికి రూ.1 కోటి వేతనం లభిస్తోంది.
A+ గ్రేడ్ను తొలగించే ఆలోచన
తాజా సమాచారం ప్రకారం, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టులపై కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా A+ గ్రేడ్ను పూర్తిగా తొలగించి, కేవలం A, B, C అనే మూడు గ్రేడ్లను మాత్రమే కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మార్పుతో పాటు వేతనాల్లో కూడా మార్పులు ఉంటాయా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
రోహిత్–కోహ్లీలకు షాక్?
ఈ అంశంపై త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అగార్కర్ కమిటీ ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలపితే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ఇది పెద్ద షాక్గా మారే అవకాశముంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ కారణంగా వారిని ఈసారి B గ్రేడ్కు పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం.
జడేజా, బుమ్రా పరిస్థితి కూడా ఇదే
టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. అంతకుముందే రోహిత్, కోహ్లి టెస్టు క్రికెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పనిభారం తగ్గించుకునే క్రమంలో ఇటీవల కొన్ని కీలక సిరీస్లకు దూరంగా ఉంటున్నాడు. ఇలా A+ గ్రేడ్లో ఉన్న నలుగురు ఆటగాళ్లు గత కొంతకాలంగా జాతీయ జట్టుకు అన్ని ఫార్మాట్ల్లో అందుబాటులో లేకపోవడం గమనార్హం.
మరిన్ని వార్తలు చదవండి: WPL 2026: వరుసగా ఐదో విజయం… గుజరాత్ జెయింట్స్పై ఆర్సీబీ ఆధిపత్యం
తరచుగా అడిగే ప్రశ్నలు
ఆటగాళ్లు అన్ని ఫార్మాట్ల్లో అందుబాటులో లేకపోవడం కారణంగా గ్రేడ్లను సరళీకృతం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.