అన్ని

తబ్రేజ్ షంషికి భారీ ఊరట జోహన్నెస్‌బర్గ్ హైకోర్టు తీర్పు క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్

సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి తన సొంత దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ సౌతాఫ్రికాపై కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటంలో విజయం సాధించాడు. జోహన్నెస్‌బర్గ్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు క్రికెట్ సౌతాఫ్రికాకు పెద్ద షాక్‌గా మారగా, షంషికి మాత్రం భారీ ఊరట కలిగించింది. కోర్టు ఆదేశాలతో షంషికి విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడే మార్గం పూర్తిగా సుగమమైంది.

అసలు విషయం ఏంటంటే, SA20 వేలంలో తబ్రేజ్ షంషిని ఎం ఐ కేప్‌టౌన్ ఫ్రాంఛైజీ ఐదు లక్షల ర్యాండ్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ ఒప్పందానికి షంషి అంగీకరించలేదు. అదే సమయంలో ఆయన ILT20 మరియు బీబీఎల్ వంటి ఇతర విదేశీ లీగ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఈ లీగ్‌ల్లో పాల్గొనాలంటే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి ఎన్ఓసీ తప్పనిసరి కావడంతో, ఇక్కడే షంషికి క్రికెట్ సౌతాఫ్రికాతో వివాదం మొదలైంది.

సొంత దేశ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే SA20ను వదిలి, విదేశీ లీగ్‌ల్లో ఆడాలనుకున్న షంషికి క్రికెట్ సౌతాఫ్రికా ఎన్ఓసీ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతడు జోహన్నెస్‌బర్గ్ హైకోర్టును ఆశ్రయించాడు.

షంషి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు అతని వాదనలను సమర్థిస్తూ అనుకూల తీర్పును వెలువరించింది. షంషి విదేశీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు అవసరమైన ఎన్ఓసీని జారీ చేయాలని క్రికెట్ సౌతాఫ్రికాను ఆదేశించింది. ఈ తీర్పుతో షంషి ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడే అవకాశం పొందాడు.

ఈ కేసులో క్రికెట్ సౌతాఫ్రికా కూడా తమ వాదనలను కోర్టు ముందు ఉంచింది. బోర్డు నిబంధనల ప్రకారం SA20 వేలంలో కొనుగోలు చేయబడిన ఆటగాడు తప్పనిసరిగా ఆ లీగ్‌లో పాల్గొనాలని, షంషి ఆ నిబంధనను ఉల్లంఘించాడని బోర్డు వాదించింది. అందుకే అతనికి ఎన్ఓసీ ఇవ్వలేదని వివరించింది.

అయితే కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది. ఒక ఆటగాడి జీవనోపాధిని అడ్డుకోవడం సరికాదని క్రికెట్ సౌతాఫ్రికాను మందలించింది. అలాగే, షంషి ఇప్పటికే 2024 అక్టోబర్‌లో క్రికెట్ సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడేందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని, అయినప్పటికీ ఐసీసీ టోర్నీల్లో సౌతాఫ్రికా తరఫున ఆడేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని షంషి స్పష్టం చేసిన విషయాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

మరిన్నివార్తలుచదవండిశ్రీలంక టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటింపు, సల్మాన్ అలీ అఘా కెప్టెన్

LastModified Date: 2025-12-29 01:31:53

తరచుగా అడిగే ప్రశ్నలు

Q. తబ్రేజ్ షంషి క్రికెట్ సౌతాఫ్రికాను కోర్టుకు ఎందుకు తీసుకెళ్లాడు?
A.

SA20 లీగ్‌లో ఆడకపోవడం కారణంగా క్రికెట్ సౌతాఫ్రికా షంషికి విదేశీ లీగ్‌ల కోసం ఎన్ఓసీ ఇవ్వకుండా నిరాకరించింది. దీంతో తన వృత్తి జీవనోపాధికి ఆటంకం కలుగుతోందని భావించిన షంషి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టును ఆశ్రయించాడు.

 

Q. కోర్టు తీర్పుతో షంషికి ఏమి లాభం కలిగింది?
A.

కోర్టు తీర్పు మేరకు షంషి ఇకపై ILT20, BBL వంటి విదేశీ టీ20 లీగ్‌ల్లో స్వేచ్ఛగా పాల్గొనవచ్చు. అలాగే అతడి ఉపాధిని అడ్డుకునే హక్కు క్రికెట్ సౌతాఫ్రికాకు లేదని కోర్టు స్పష్టం చేసింది.

Krishna R
Krishna R

I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.

నవీకరణలు