
శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2026కు ముందు సల్మాన్పై పీసీబీ వేటు వేయవచ్చని వార్తలు వచ్చినప్పటికీ, బోర్డు అతడిపై మరోసారి పూర్తి నమ్మకం ఉంచింది.
ఈ సిరీస్కు పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్లు దూరమయ్యారు. ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్లో పాల్గొంటుండటంతో, సెలక్టర్లు వారిని ఈ సిరీస్కు పరిగణలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు బిగ్ బాష్ లీగ్ పూర్తి సీజన్కు అందుబాటులో ఉండనున్నారు.
మరోవైపు, భుజం శస్త్రచికిత్స కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ ఈ సిరీస్తో మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్కు ముందు అతడి పునరాగమనం పాకిస్థాన్ జట్టుకు పెద్ద బలంగా మారనుంది.
అలాగే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఖవాజా నఫాయ్కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. అతడి ఎంపిక భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా భావిస్తున్నారు.
ఈ టీ20 సిరీస్ జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు మ్యాచ్లు శ్రీలంకలోని డంబుల్లా వేదికగానే జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ను నిర్వహిస్తున్నారు.
మ్యాచ్ల షెడ్యూల్ (డంబుల్లా):
మొదటి టీ20 – జనవరి 7
రెండవ టీ20 – జనవరి 9
మూడవ టీ20 – జనవరి 11
శ్రీలంకతో టీ20ల కోసం పాకిస్థాన్ జట్టు:
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిఖ్.
మరిన్నివార్తలుచదవండి: గంభీర్కు పదవీ గండమా? అతడితో రహస్య చర్చలు జరిపిన బీసీసీఐ!