
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఏ20) 2025–26 సీజన్ను సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ అద్భుతంగా ప్రారంభించింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం బోలాండ్ పార్క్ వేదికగా పార్ల్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్, 11 ఓవర్లు 5 బంతుల్లోనే కేవలం 49 పరుగులకు కుప్పకూలింది.
సన్రైజర్స్ బౌలర్ల దాటికి పార్ల్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలకడగా ఆడలేకపోయాడు. మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
కెప్టెన్ డేవిడ్ మిల్లర్ కూడా కేవలం 7 పరుగులకే వెనుదిరిగి, జట్టును ఆదుకునే ప్రయత్నం చేయలేకపోయాడు. సన్రైజర్స్ స్పీడ్ స్టార్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ఆడమ్ మిల్నే, తరిందు రత్నాయకే చెరో రెండు వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.
హెర్మన్ హాఫ్ సెంచరీ
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. జోర్డాన్ హెర్మన్ 5 ఫోర్లు, 4 సిక్స్లతో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడికి క్వింటన్ డికాక్ 42 పరుగులతో చక్కటి సహకారం అందించాడు.
పార్ల్ రాయల్స్ చెత్త రికార్డు
ఈ మ్యాచ్లో 49 పరుగులకే ఆలౌటైన పార్ల్ రాయల్స్, ఎస్ఏ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అవాంఛిత రికార్డు ప్రిటోరియా క్యాపిటల్స్ (52 పరుగులు) పేరిట ఉండగా, తాజా పరాజయంతో పార్ల్ రాయల్స్ ఆ రికార్డును కూడా అధిగమించింది.
మరిన్నివార్తలుచదవండి: ENG vs AUS: రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. క్రికెట్ ఆస్ట్రేలియాకు రూ.60 కోట్లకు పైగా నష్టం!