T20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఫిట్నెస్ సమస్యలు ఉన్నప్పటికీ, సెలెక్టర్లు అనుభవానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, టిమ్ డేవిడ్. ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు జనవరి 2లోగా ICCకి పంపాల్సిన ప్రొవిజనల్ 15 మంది స్క్వాడ్లో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ జాబితాలో ప్రధాన దృష్టి అంతా పాట్ కమిన్స్పైనే ఉంది. వెస్టిండీస్ పర్యటనలో లంబార్ స్ట్రెస్ గాయానికి గురైన కమిన్స్, జులై తర్వాత కేవలం ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే అడిలైడ్లో జరిగిన అషెస్ మూడో టెస్టులో అతని రీటర్న్ ఆకట్టుకుంది. పూర్తి వేగంతో బౌలింగ్ చేస్తూ ఆరు వికెట్లు పడగొట్టి, ఎలాంటి అసౌకర్యం లేకుండా కనిపించాడు.
అయినా కూడా కమిన్స్ విషయంలో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో అతని వెన్నుపై ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ విశ్రాంతి ఇచ్చారు. సుమారు నాలుగు వారాల్లో మరోసారి స్కాన్ చేయనుండగా, దాని ఆధారంగానే అతని లభ్యతపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా జెమిమా రోడ్రిగ్స్
కమిన్స్ ఫిట్నెస్పై అనిశ్చితి ఉన్నా, సెలెక్టర్ల నమ్మకం మాత్రం గట్టిగానే
అనిశ్చితి ఉన్నప్పటికీ, కమిన్స్ ప్రభావాన్ని తేలికగా పక్కన పెట్టలేమన్నది సెలెక్టర్ల అభిప్రాయం. ఫిట్గా ఉంటే తుది జట్టులో ఖచ్చితంగా ఆడే ఆటగాడిగా అతన్ని భావిస్తూ, ప్రొవిజనల్ స్క్వాడ్లో మాత్రం తప్పకుండా చేర్చాలని నిర్ణయించారు.
జోష్ హాజిల్వుడ్ పరిస్థితి మాత్రం కొంత స్పష్టంగా ఉంది. హామ్స్ట్రింగ్, అకిలీస్ సమస్యల కారణంగా అతను అషెస్ సిరీస్కు దూరమయ్యాడు. ప్రస్తుతం మళ్లీ బౌలింగ్ ప్రారంభించిన హాజిల్వుడ్ త్వరలోనే మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో అతని T20I ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని, వరల్డ్ కప్ బౌలింగ్ యూనిట్లో అతన్ని కీలక ఆటగాడిగా పరిగణిస్తున్నారు.
టిమ్ డేవిడ్ విషయంలో స్వల్ప ఆందోళన ఉంది. బిగ్ బాష్ లీగ్లో బాక్సింగ్ డే మ్యాచ్ సందర్భంగా అతనికి హామ్స్ట్రింగ్ గాయం తగిలింది. ప్రస్తుతం స్కాన్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం గాయం తీవ్రమైనది కాదని, వరల్డ్ కప్ తొలి మ్యాచ్కి అతను అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియా శిబిరం నమ్ముతోంది.
వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా ఆస్ట్రేలియా జనవరి చివర్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో మూడు మ్యాచ్ల T20I సిరీస్ ఆడనుంది. అయితే వర్క్లోడ్ నియంత్రణ దృష్ట్యా, కొంతమంది వరల్డ్ కప్ ఆటగాళ్లు బిగ్ బాష్ ఫైనల్స్కు దూరంగా ఉండే అవకాశమూ ఉన్నట్లు సమాచారం.
విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు ప్రకటింపు: రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్, సంజూ సాంసన్ ప్రధాన ఆకర్షణ