Afghanistan A need 292 runs in 46.3 remaining overs
అన్ని

పాక్ చేతిలో ఘోర ఓటమి.. అండర్ 19 జట్టుపై బీసీసీఐ సీరియస్

దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు 191 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. టోర్నీ ఆరంభం నుంచి ఓటమి ఎరుగని ప్రదర్శన చేసిన భారత్‌.. ఫైనల్‌లో మాత్రం పూర్తిగా తడబడటం తీవ్ర చర్చకు దారి తీసింది.

ఈ ఓటమిపై డిసెంబర్ 22న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఫైనల్‌లో ఎదురైన పరాజయానికి గల కారణాలను లోతుగా విశ్లేషించేందుకు ప్రత్యేక రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. కీలక మ్యాచ్‌లో జట్టు ఎందుకు విఫలమైందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను బీసీసీఐ కోరింది.

ఈ సమీక్షలో భాగంగా హెడ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, కెప్టెన్ ఆయుష్ మ్హాత్రేలతో బీసీసీఐ అధికారులు నేరుగా మాట్లాడనున్నారు. సాధారణంగా జూనియర్ స్థాయిలో ఇంత కఠినమైన సమీక్షలు జరగడం అరుదే. అయితే త్వరలో జరగబోయే అండర్-19 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్‌లో ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో ఫైనల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హాత్రే ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ బౌలర్ల స్లెడ్జింగ్‌కు ప్రతిగా వీరు చూపించిన కొన్ని హావభావాలు, దూకుడు ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా కేవలం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ షూ చూపిస్తూ చేసిన సంజ్ఞలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి క్రమశిక్షణ అంశం కూడా రివ్యూ కమిటీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బోర్డు వీరి ప్రవర్తనను తప్పుబడితే, భవిష్యత్ టోర్నీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

ఇక జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 జనవరిలో ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించాల్సి ఉంది. ఆలోపే ఈ సమీక్షను పూర్తిచేసి, లోపాలను సరిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది. ఆటలో ఓటమి ఒక ఎత్తయితే, మైదానంలో క్రమశిక్షణ తప్పడం మరో ఎత్తు అన్న భావనలో బోర్డు పెద్దలు ఉన్నారు. అందుకే ఈసారి క్లీనప్ ప్రక్రియ పూర్తిస్థాయిలో, పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు చదవండి: T20 World Cup: ఈ ప్లేయింగ్ 11తో కప్ ఖాయం… ప్రత్యర్థులకు గుండెల్లో వణుకు!

LastModified Date: 2025-12-23 14:28:55

తరచుగా అడిగే ప్రశ్నలు

Q. U19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఎందుకు ఓడింది
A.

కీలక సమయంలో బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ జట్టు విఫలమవడంతో భారీ ఓటమి ఎదురైంది.

Guna SRV
Guna SRV

I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.