
స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు భారత జట్టును జనవరి తొలి వారంలో బీసీసీఐ ప్రకటించనున్నట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ జనవరి 3 లేదా 4 తేదీల్లో వర్చువల్గా సమావేశం కానుంది. ఈ సమావేశంలో కివీస్తో జరిగే వన్డే సిరీస్కు సంబంధించిన భారత జట్టును ఖరారు చేయనున్నారు.
గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు గిల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ మధ్యలో మెడ గాయం కారణంగా శుభ్మన్ గిల్ వైదొలగడంతో, ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్కు అతడు అందుబాటులో లేకపోయాడు. ఆ సమయంలో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు చేపట్టాడు.
అనంతరం గిల్ తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. అయితే నాలుగో టీ20 మ్యాచ్కు ముందు అతడికి కాలి మడమ గాయం కావడంతో, చివరి రెండు టీ20లకు కూడా దూరమయ్యాడు.
ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో కూడా గిల్కు చోటు దక్కలేదు. అయినప్పటికీ ప్రస్తుతం అతడు పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం మొహాలీలోని పీసీఏ స్టేడియంలో కఠినంగా సాధన చేస్తున్నాడు.
అయితే వన్డే జట్టు నాయకత్వం చేపట్టిన తర్వాత గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అతడు విఫలమయ్యాడు. దీంతో తన రీఎంట్రీలో న్యూజిలాండ్పై సత్తా చాటాలని శుభ్మన్ గిల్ ఉత్సాహంగా ఉన్నాడు.
ఇక మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ కూడా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో తన ప్రాక్టీస్ను ప్రారంభించాడు. త్వరలోనే వైద్య బృందం అతడికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనుంది.
ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే, న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టు (అంచనా):
శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, తిలక్ వర్మ.
మరిన్నివార్తలుచదవండి: యాషెస్ 2025-26: బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజే 20 వికెట్లు.. మెల్బోర్న్లో బౌలర్ల హవా