ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఎక్కువ ధరకు అమ్ముడయ్యే ఆటగాళ్లు ఎవరు?
ఐపీఎల్ 2026 మినీ వేలం ముందు, ఇటీవల ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని పేర్లు ఊహించినవి అయితే, మరికొన్ని పేర్లు మాత్రం అభిమానులకు పెద్ద షాక్గా మారాయి. ప్రత్యేకంగా ఆండ్రీ రసెల్ను కోల్కతా నైట్ రైడర్స్, మతీశ పతిరనను చెన్నై సూపర్ కింగ్స్ వదిలేయడం ఎవ్వరూ ఊహించని విషయమే. ఇప్పుడు మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లపై ఓసారి దృష్టి వేసేద్దాం.
వచ్చే ఏడాది ఐపీఎల్ 19వ సీజన్ జరగనుండగా, అందుకు ముందుగా డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 15న అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ప్లేయర్లు, విడుదల చేసిన ప్లేయర్లు, అలాగే ట్రేడ్ ద్వారా తీసుకున్న మరియు ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి.
ఇప్పుడు ఈ జాబితాలలో ఉన్న విడుదలైన ఆటగాళ్లతో పాటు కొత్తగా నమోదు అయ్యే క్రికెటర్లు కూడా వేలంలో కనిపించనున్నారు. ముఖ్యంగా కొన్ని జట్లు అనూహ్యంగా తమ స్టార్ ఆటగాళ్లను వదిలేసి అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, లంక వేగవంతమైన బౌలర్ మతీశ పతిరనను విడుదల చేయడం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచింది. అలాగే మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్, 2014 నుంచి జట్టులో కొనసాగుతున్న విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ను వదిలేయడం ఎవ్వరూ ఊహించలేదు.
మినీ వేలంలో జట్లు తమ స్క్వాడ్లో అత్యవసరమైన ఒకటి లేదా రెండు కీలక స్థానాలు భర్తీ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ కారణంగానే స్టార్ ప్లేయర్లు మరోసారి పెద్ద ధరకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వేలంలో ఎక్కువ డిమాండ్ కలిగే అవకాశం ఉన్న ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
ఆండ్రీ రసెల్
టీ-20 ఫార్మాట్లో ఆల్ రౌండర్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. రసెల్ 2025 ఐపీఎల్ సీజన్లో పెద్దగా రాణించకపోయినా, అతను ఎల్లప్పుడూ మ్యాచ్ మార్చే శక్తి ఉన్న ఆటగాడే. గతంలో కేకేఆర్ తరఫున అనేక మ్యాచ్లను ఒంటరిగా గెలిపించిన రసెల్ను ఆ జట్టు 12 ఏళ్ల పాటు రిటైన్ చేసి కొనసాగించింది. గత సీజన్కు రూ.12 కోట్లకు రిటైన్ చేశారు. అతని స్ట్రైక్ రేట్ 163.73 ఉండటం, బౌలింగ్లో కూడా సహకరించడం అతని ప్రత్యేకత. దీంతో కేకేఆర్ మళ్లీ తక్కువ ధరకైనా అతడిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఇతర ఫ్రాంచైజీలు కూడా ఫినిషర్ లేదా ఆల్ రౌండర్ కోసం రసెల్ను కొనుగోలు చేయడానికి పోటీ పడవచ్చు.
మతీశ పతిరన
చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన లంకా పేసర్ పతిరన వయసు కేవలం 22 సంవత్సరాలే. గతంలో సీఎస్కే అతడిని రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది. 2025లో కొంత ఎక్కువ పరుగులిచ్చినా, గత మూడు సీజన్లలో 30 మ్యాచ్ల్లో 45 వికెట్లు తీసి తన ప్రతిభను నిరూపించాడు. డెత్ ఓవర్లలో వికెట్లు తీయడం, యార్కర్లు వేయడంలో మలింగ తరహా నైపుణ్యం అతనికి ఉంది. అందువల్ల మినీ వేలంలో పతిరనకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఖాయం.
డేవిడ్ మిల్లర్
ఐపీఎల్లో అనుభవం, 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచినప్పుడు కీలక పాత్ర, మరియు మ్యాచ్ విన్నర్ అన్న పేరుతో మిల్లర్ లీగ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.7.5 కోట్లతో రిటైన్ చేసినా ఇప్పుడు విడుదల చేసింది. విదేశీ కోటాలో శక్తివంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం చూస్తున్న జట్లకు మిల్లర్ బెస్ట్ ఆప్షన్ అవుతాడు. అతడిని కోసం పలు జట్లు పోటీ పడతాయి.
రవి బిష్ణోయ్
టి-20ల్లో నిలకడగా ఆడుతున్న బిష్ణోయ్ గత ఐపీఎల్ సీజన్లో మాత్రం పెద్దగా మెరిసలేదు. దీంతో లక్నో అతడిని విడుదల చేసింది. అంతకుముందు రూ.11 కోట్లకు రిటైన్ చేసిన విషయం గమనార్హం. అంతర్జాతీయ టీ-20ల్లో నం.1 ర్యాంక్ సాధించిన భారత స్పిన్నర్లలో ఒకడు. దేశీయ కోటాలో మంచి స్పిన్నర్ కోసం చూస్తున్న జట్లకు బిష్ణోయ్ ఆకర్షణీయ ఎంపిక.
వెంకటేశ్ అయ్యర్
కేకేఆర్ గత సీజన్ కోసం మెగా వేలంలో రూ.23.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వెంకటేశ్ అంచనాలను అందుకోలేకపోయాడు. కీలక ఆటగాళ్లను వేలంలో దక్కించుకోవడానికి పర్స్ మిగిలించడం కోసం అతడిని విడుదల చేశారు. లెఫ్ట్ హ్యాండర్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్, అవసరానికి బౌలింగ్, మరియు మ్యాచ్ మలుపు తిప్పే సామర్థ్యం వెంకటేశ్ ప్రత్యేకత. ఆల్ రౌండ్ నైపుణ్యాల కారణంగా అతడు కూడా పలు ఫ్రాంచైజీలకు ప్రధాన టార్గెట్గా మారవచ్చు.
మరిన్ని వార్తలు చదవండి: T20 వరల్డ్ కప్ 2026: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.