Senuran Muthusamy: 11 ఏళ్లకే నాన్నను కోల్పోయిన ముత్తుసామి.. అమ్మే కోచ్గా మారి... భారత్పై అద్భుత సెంచరీ

సౌతాఫ్రికా ఆల్రౌండర్ సెన్యురన్ ముత్తుసామి పేరు ఇప్పటివరకు భారత క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ గౌహతిలో భారత్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో అతను ఆడిన అద్భుత ఇన్నింగ్స్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్కు అత్యంత క్లిష్టంగా మారిన పిచ్పై ఏడో స్థానంలో క్రీజులోకి వచ్చిన ముత్తుసామి, బుమ్రా, సిరాజ్, కుల్దీప్లాంటి భారత బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొని చక్కని సెంచరీ నమోదు చేశాడు. గెలుపోటములు పక్కన పెడితే. ఈ సెంచరీ వెనుకున్న అతని జీవన ప్రయాణం, తల్లిదండ్రుల కలలు, పట్టుదల నిజంగా స్ఫూర్తినిచ్చే కథ.
ముత్తుసామి భారతీయ మూలాలు కలిగిన ఆటగాడు. అతని పూర్వీకులు తమిళనాడులోని నాగాపట్టణం ప్రాంతం నుంచి సంవత్సరాల క్రితం సౌతాఫ్రికాకు వలస వెళ్లారు. అతను జన్మించి పెరిగిందీ డర్బన్లోనే. చిన్నతనం నుంచే ముత్తుసామిని క్రికెట్ వైపు మళ్లించిన వ్యక్తి అతని తండ్రి. కానీ దురదృష్టవశాత్తు, ముత్తుసామికి 11 సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించాడు. కుటుంబ బాధ్యతలన్నీ ఒక్కరే భరించిన అమ్మ వాణి మూడ్లీ, తన భర్త ఆశయాన్ని నెరవేర్చేందుకు కొడుకును క్రికెట్లో ముందుకు నడిపించారు.
ముత్తుసామి తల్లి ఇచ్చిన మద్దతు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. ఆమె ముందుగా స్వయంగా క్రికెట్ నేర్చుకుని, తన కొడుకు బ్యాటింగ్–బౌలింగ్ వీడియోలను తీశి, వాటిలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దేలా చూసేది. ఒక మంచి క్రికెటర్ కావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత త్యాగం చేయాలి అన్నది ఆమె తన నిశ్శబ్ద పోరాటంతో నిరూపించింది.
వారి కుటుంబం ఎన్నేళ్లుగా మోస్తున్న కల సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడటం. ముత్తుసామి ఆ కలను 2019లోనే నెరవేర్చాడు. మరింత ఆశ్చర్యమేమంటే, అతని అరంగేట్రం కూడా భారత్పైనే విశాఖపట్నంలో జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే భారత జట్టుపై తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేయడం ఒక అందమైన యాదృచ్చికం.
ఈ సెంచరీతో ముత్తుసామి పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. గత 15 ఏళ్లలో భారత్ నేలపై ఏడో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన ఆటగాళ్లు ఇద్దరే. 2019లో క్వింటన్ డి కాక్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడు అతనే.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో భారత్లో టెస్ట్ సెంచరీ చేసినవారిలో కూడా ముత్తుసామి అరుదైన పేరు. డీన్ ఎల్గార్ 2019లో చేసిన తర్వాత ఆ రికార్డు తిరిగి సొంతం చేసుకున్న ప్రోటియా బ్యాటర్ ముత్తుసామినే. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాల్లో 50కుపైగా స్కోరు చేసిన కేవలం నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడు కూడా అతడే. ముందుగా ఈ జాబితాలో టెంబా బావుమా, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్ మాత్రమే ఉండేవారు.
తండ్రి పెట్టిన ఆశయాన్ని తన తల్లి అండగా నిలబెట్టి ముందుకు నడిపిందంటే ముత్తుసామి నేటి స్థానం అందుకు బ్రహ్మాండమైన ఉదాహరణ. తన కృషితో, నిబద్ధతతో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక ముద్ర వేస్తున్నాడు. అతని స్ఫూర్తిదాయక ప్రయాణం ఎన్నో యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంది.
మరిన్ని వార్తలు చదవండి: 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో మొదటిసారి 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా..!
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.