అన్ని

టీ20 వరల్డ్ కప్ 2026 భారత జట్టు ప్రకటింపు: గిల్‌కు షాక్, అక్షర్ వైస్ కెప్టెన్, కిషన్‌కు ఛాన్స్

టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026 కోసం ప్రకటించిన భారత జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నియమించింది.

ఈ ఏడాది ఆసియా కప్‌తో టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన శుభ్‌మన్ గిల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపలేకపోయాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతడి ఆట తీవ్రంగా నిరాశపరిచింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన గిల్‌ను, చివరి రెండు మ్యాచ్‌లకు గాయాన్ని కారణంగా చూపుతూ జట్టు మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది.

దీంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సంజూ నిలకడగా రాణించడంతో, ఇకపై అతడినే ఓపెనర్‌గా కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

ఈ కారణంతోనే గిల్‌ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా స్పష్టం చేశాడు. గిల్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడని, గత టీ20 ప్రపంచకప్‌లో కూడా అతడు జట్టులో లేకపోయిన విషయాన్ని అగార్కర్ గుర్తుచేశాడు.

ఇషాన్ కిషన్‌కు అవకాశం
వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, కిషన్‌ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేసింది. అయితే ఇప్పటివరకు టీ20 జట్టులో భాగంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ శర్మపై సెలెక్టర్లు వేటు వేశారు.

జితీష్ స్థానంలోనే రెండో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న ఫినిషర్ రింకూ సింగ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ రెండు మార్పులు తప్ప, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టునే ప్రపంచకప్ టోర్నీకి కొనసాగించారు. ఇదే జట్టు న్యూజీలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా పోటీ పడనుంది.

ఇషాన్ కిషన్ చివరిసారిగా భారత్ తరఫున 2023లో ఆడాడు. దేశవాళీ టోర్నీల్లో అతడు అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో, సెలెక్టర్లు మరోసారి అతడికి అవకాశం కల్పించారు. కాగా టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2026కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.

మరిన్ని వార్తలు చదవండి: కెమెరామెన్‌కు క్షమాపణలు చెప్పి ఆలింగనం చేసిన హార్దిక్ పాండ్యా

LastModified Date: 2025-12-20 19:31:46

తరచుగా అడిగే ప్రశ్నలు

Q. టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో శుభ్‌మన్ గిల్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
A.

ఇటీవలి టీ20 సిరీస్‌లలో శుభ్‌మన్ గిల్ నిలకడగా రాణించలేకపోవడం మరియు సంజూ శాంసన్ ఓపెనర్‌గా మెరుగైన ప్రదర్శన చూపడంతో, సెలెక్టర్లు గిల్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయలేదు.

Q. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు వైస్ కెప్టెన్ ఎవరు?
A.

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టుకు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.

Krishna R
Krishna R

I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.

నవీకరణలు